
Andhra Pradesh : ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, విభజన మరింత ఈజీ కానుంది.
ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్టీజీఎస్ సేవలపై అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సులభంగా రేషన్ కార్డుల్లో పేర్లను చేర్చడం, తొలగించడం, కార్డులను విభజించడం వంటి సేవలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సేవలను త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందించే ధ్రువపత్రాల జారీ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని లోకేష్ పేర్కొన్నారు. ఆదాయ, కుల ధ్రువపత్రాల జారీలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగించి, ప్రజలకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సమీకరించే డేటా లేక్ పనులను జూలై నెలాఖరులోపు పూర్తి చేయాలని సూచించారు.
మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకునేలా ప్రజలకు చేరువచేయాలని సూచించారు. నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. విద్యార్థులకు విద్యా సంస్థలు, క్రీడా సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్లు అభ్యర్థి ఆధార్ నెంబర్ ద్వారా డీజీ వెరిఫై ఆధారంగా పారదర్శకంగా జరిగేలా చూడాలని అన్నారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న రేషన్ సేవలను మరింత సులభతరం చేయాలని లోకేశ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ సేవలతో పాటు అనేక ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు చేయించుకోవాలన్నా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లినా, లేదంటే వాట్సాప్ ద్వారానే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని తగ్గి, ప్రజల సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయని చెబుతున్నారు.