
మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో వికాసం పోయి విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలాయని కేటీఆర్ మండిపడ్డారు. కేసీఆర్ కిట్ పోయి కరెంటు కోతలు వచ్చాయని.. రైతుబంధు పోయి 'రాహుల్ బంధు' వచ్చిందని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలకు పాతర వేసి, కుంభకోణాల జాతర నడిపిస్తున్నారని ఆరోపించారు.
మహేశ్వరంలో కార్యకర్తల జోష్ చూస్తుంటే సబితా ఇంద్రారెడ్డి గెలుపు, రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం తథ్యమనిపించిందన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నా.. జనం మాత్రం 50 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్నే తలుచుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలవడం పక్కా అని జోస్యం చెప్పారు.
కార్యకర్తలే కథానాయకులై కదం తొక్కితే ప్రతి బూత్లో బీఆర్ఎస్కే మెజారిటీ వస్తుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి ఇప్పటి నుంచే కేడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవాలని... అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.