
కిసాన్ వికాస్ పత్ర (KVP) అనేది కేంద్ర ప్రభుత్వం మద్ధతుతో పోస్టాఫీస్ నిర్వహించే పొదుపు పథకం. దీనిని చాలా మంది "మనీ డబ్లింగ్ స్కీమ్"గా కూడా పిలుస్తారు.
షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండి, భద్రతతో కూడిన పెట్టుబడి కోరుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. ఇందులో పెట్టిన డబ్బుకు భారత ప్రభుత్వం హామీ ఇస్తుండటంతో పెట్టుబడిదారులు నమ్మకంగా పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రస్తుతం పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర పథకంపై ఏడాదికి 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ రేటు ప్రకారం పెట్టుబడి చేసిన మొత్తం 115 నెలల్లో, అంటే సుమారు 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు, మీరు ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, గడువు ముగిసే సమయానికి సుమారు రూ.10 లక్షలు పొందుతారు. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా నిర్ణీత రాబడి లభించడం ఈ పథకం ప్రధాన ప్రయోజనం.
ఈ పథకంలో కనీసం రూ.1,000తోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. అంతేకాకుండా గరిష్ట పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. పెట్టుబడిదారుల ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఎంత మొత్తమైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. చిన్న మొత్తాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద మొత్తాలను కూడా పెట్టుబడిగా పెట్టుకోవచ్చు.
దేశంలోని ఏ పోస్టాఫీస్లోనైనా ఈ పథకం కింద ఖాతా ప్రారంభించవచ్చు. వ్యక్తిగతంగా (Single Account) లేదా ఇద్దరు కలిసి (Joint Account) కూడా ఖాతా తెరవచ్చు. అలాగే పిల్లల భవిష్యత్ కోసం వారి పేరుతో కూడా ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే పిల్లల పేరుతో ఖాతా తెరవాలంటే వారి వయస్సు కనీసం 10 సంవత్సరాలు ఉండాలి.
కిసాన్ వికాస్ పత్ర పథకం సురక్షిత పెట్టుబడి కోరుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ప్రభుత్వ హామీ, నిర్ణీత వడ్డీ రేటు, డబ్బు రెట్టింపు అయ్యే స్పష్టమైన గడువు, కనీస పెట్టుబడి మొత్తం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ పథకం ప్రజల్లో ఆదరణ పొందుతోంది. దీర్ఘకాలికంగా సురక్షితంగా సంపద పెంచుకోవాలనుకునే వారికి పోస్టాఫీస్ KVP పథకం మంచి ఎంపికగా చెప్పవచ్చు.