
ప్రముఖ తమిళ సినీ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ (73) శనివారం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.
భాగ్యరాజ్ మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. భారతీయ సినిమాకు భాగ్యరాజ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. భాగ్యరాజ్ మరణం తమిళ చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర సాంస్కృతిక రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా, సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన అరుదైన ప్రతిభాశాలి అని కొనియాడారు. తన విలక్షణమైన కథన శైలి, సహజమైన హాస్యం, గ్రామీణ నేపథ్యాలను వాస్తవికంగా చూపిన విధానంతో తమిళ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని గుర్తుచేశారు.ఆయన సినిమాలు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా, మానవ విలువలు, సామాజిక అంశాలను ప్రతిబింబించాయని సీఎం విజయ్ వివరించారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన భాగ్యరాజ్, 1979లో 'సువారిల్లత చిత్రంగళ్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి, తమిళ ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. భాగ్యరాజ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.