
రాజమౌళి.. ఇండియన్ సినిమా దశ దిశని మార్చిన దర్శకుడు. మన భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు. తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటారు. ఇండియన్ సినిమాకి టాలీవుడ్ని ఫేస్ ఆఫ్గా నిలిపారు.
`బాహుబలి` సినిమాతోనే ఇలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు జక్కన్న. `సింహాద్రి` నుంచి రాజమౌళి లెక్కనే మారిపోయింది. `ఛత్రపతి`, `యమదొంగ`, `ఈగ`, `మగధీర` చిత్రాలతో తనని తాను నిరూపించుకుంటూ వచ్చారు.
`బాహుబలి`లో రాజమౌళి ఏంటనేది అందరికి తెలిసింది. అయితే బాహుబలి 2 ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ మూవీ రూ.1800కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఆ తర్వాత తీసిన `ఆర్ఆర్ఆర్` యావరేజ్గానే ఆడింది. ఇప్పుడు `వారణాసి` తో భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించే పనిలో ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లక్ష్యంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు రాజమౌళి. ఇదిలా ఉంటే `బాహుబలి` రిలీజ్ అయి తొమ్మిదేళ్లు అవుతుంది. కానీ దీని జర్నీ మాత్రం ఆగడం లేదు. గతేడాది రెండు పార్ట్ లను కలిపి రిలీజ్ చేయగా, మంచి ఆదరణ పొందింది. త్వరలో `బాహుబలి 3` కూడా ఉండబోతుందని అంటున్నారు.
ఇప్పుడు రాజమౌళి `బాహుబలిః ది టార్చ్ బేరర్` అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రస్తుతం ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో `బాహుబలి` మూవీకి సంబంధించిన జర్నీని పంచుకున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి, రమా రాజమౌళి, సింహ, కీరవాణి ఇలా సినిమాకి పనిచేసిన అందరు ఆ జర్నీని, మెమొరీస్ని పంచుకున్నారు. ఆయా విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇందులో భాగంగా ఈ మూవీకి సంబంధించి ప్రారంభంలో వచ్చిన టాక్ గురించి చెప్పారు.
`బాహుబలి` మొదటి భాగం విడుదలైనప్పుడు సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందట. ఈ విషయాన్ని చాలా సార్లు వెల్లడించారు రాజమౌళి. తాజాగా విడుదల చేసిన డాక్యుమెంటరీలో కూడా అదే విషయాన్ని చెప్పారు. మొదట రోజు టాక్ ఏంటో అర్థం కాలేదని తెలిపారు. అయితే నిర్మాతలకు మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చిందట. సినిమా వేస్ట్, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు, ఇంకా రెండో పార్ట్ మర్చిపోండి అన్నారట. నిర్మాత ఆ విషయాన్ని రాజమౌళి కి చెప్పలేదట. రాజమౌళి పని అయిపోయిందనేలా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడారట. క్రిటిక్స్ నుంచి కూడా నెగటివ్ టాక్ వచ్చింది. ఎలా ఏంటి? పెట్టిన డబ్బు ఎలా రికవరీ కావాలి? మనం సేఫ్ కావడం ఎలా అనే ఆలోచనలో పడ్డారట రాజమౌళి. రెండు రోజులు అసలేం అర్థం కాలేదని తెలిపారు జక్కన్న.
ఇక దీనిపై రమా రాజమౌళి కూడా స్పందించింది. సినిమా పోయిందన్నారు. డిజాస్టర్ అంటున్నారు, ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదని అంటున్నారు. వారి మాటలు వినే సరికి తనకు టెన్షన్ స్టార్ట్ అయ్యిందని, నష్టాలను ఎలా పూడ్చాలి, ఉన్న స్థలం ఒకటి అమ్మేద్దామని అనుకుందట రమా రాజమౌళి. మణికొండ సమీపంలో ఉన్న స్థలం అమ్మేద్దామని నిర్ణయించుకుందట. దాని వల్ల ఎలాంటి నష్టాలు తీరవు, కానీ ఆ సమయంలో తనకు అదొక్కటే గుర్తొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం వీరి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత బాహుబలి ఎంతటి పెద్ద విజయం సాధించిందో తెలిసిందే.