అయోధ్య రామమందిరం విరాళాల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు.
ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.విరాళాల రూపంలో అందిన నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో భాగంగా చంపత్ రాయ్ మాజీ సహాయకుడితో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులు జరిగిన మరుసటి రోజే చంపత్ రాయ్, అనిల్ మిశ్రా తమ పదవుల నుంచి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్లో వీరిద్దరి పేర్లు లేకపోవడం గమనార్హం.రామమందిర ఉద్యమంలో చంపత్ రాయ్ దశాబ్దాలుగా క్రియాశీలక పాత్ర పోషించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించిన న్యాయపోరాటం నుంచి భూమి పూజ, ప్రాణప్రతిష్ఠ వరకు అన్ని వ్యవహారాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మందిర నిర్మాణ సమయంలో ట్రస్ట్ కార్యకలాపాల్లో అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరించారు. ఈ వివాదంపై ఆరెస్సెస్, వీహెచ్పీ వర్గాల నుంచి ఒత్తిడి రావడంతోనే వారు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది.చంపత్ రాయ్ 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ప్రస్థానం బిజ్నోర్లోని ధాంపూర్లో గల ఆర్ఎస్ఎం డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం అధ్యాపకుడిగా ప్రారంభమైంది. 1977లో ఎమర్జెన్సీ సమయంలో ఆరెస్సెస్ తరఫున కళాశాలలో ఉపన్యసిస్తున్న తరుణంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.