సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన తిక్క...
సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన తిక్క పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు చేసిన వింత చేష్టలు, ప్రమాదకర స్టంట్లు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన చర్చకు దారితీశాయి. దట్టమైన అటవీ ప్రాంత రహదారులపై వేగంగా వెళ్తున్న ఒక మహీంద్రా థార్ కారు బోనెట్, టాప్పై కూర్చొని ఉప్పల్ బాలు ప్రమాదకరమైన రీతిలో విన్యాసాలు చేస్తూ రీల్స్ వీడియోలు చేశాడు.ఈ వీడియోలు కాస్తా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై విపరీతంగా వైరల్ కావడంతో స్థానికులు, అనంతగిరి పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో పవిత్రమైన, ప్రశాంతమైన పుణ్యక్షేత్ర వాతావరణాన్ని ఇలాంటి వెర్రి చేష్టలతో అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే ఇతర వాహనదారుల భద్రతను సైతం ప్రమాదంలో పడేస్తూ.. అటవీ శాఖ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన ఉప్పల్ బాలు, అతని మిత్రులపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేశారు.ఈ వివాదాస్పద వ్యవహారంపై వికారాబాద్ అటవీ శాఖ అధికారులు వేగంగా స్పందించారు. వన్యప్రాణుల రక్షణ, అభయారణ్య పరిధిలోకి వచ్చే అనంతగిరి కొండల ప్రాంతంలో ఇలాంటి ప్రమాదకరమైన, శబ్ద కాలుష్యంతో కూడిన విన్యాసాలు చేయడం వన్యప్రాణుల చట్టాల ప్రకారం పూర్తిగా చట్టవిరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఉప్పల్ బాలుపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు.ఈ ప్రమాదకరమైన రీల్స్ చిత్రీకరణ కోసం వాడిన మహీంద్రా థార్ కారును నంబర్ ప్లేట్ ఆధారంగా గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కారు యజమాని, ఆ సమయంలో వాహనాన్ని నడిపిన వారిని కూడా పిలిపించి విచారించనున్నట్లు, వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కేవలం వ్యూస్, ఫాలోవర్లను పెంచుకోవడం కోసం ఇలా పర్యావరణానికి, అడవిలోని మూగజీవాలకు, పర్యాటకుల ప్రాణాల భద్రతకు ముప్పు తెచ్చే పనులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని వికారాబాద్ అటవీ అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.