దేశ రాజధాని న్యూఢిల్లీలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కర్ణాటకకు చెందిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.
సాయి కుమార్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రసిద్ధ నిర్మాణ సంస్థ 'కెవిఎన్ ప్రొడక్షన్స్' అధినేత అయిన వెంకట్, ఈ గౌరవప్రదమైన బాధ్యతల్లో ఏడాది పాటు కొనసాగనున్నారు. ఆయన సేవా నిబంధనలు, ఇతర పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం వెనుక బలమైన స్నేహ బంధం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ రాజకీయ అరంగేట్రం, ఎన్నికల వ్యూహాలు, ప్రచారం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేంత వరకు వెంకట్ కె. నారాయణ నీడలా వెన్నంటే నిలిచారు. వీరిద్దరి కలయికలో తెరకెక్కిన 'జననాయగన్' అనే భారీ బడ్జెట్ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కొన్ని వివాదాల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యమవుతున్నప్పటికీ, రాజకీయంగా విజయ్కు పూర్తి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతగానే సీఎం ఈ కీలక పదవిని ఆయనకు కట్టబెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాల నుంచి విమర్శలుమరోవైపు ఈ నియామకంపై తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేగుతోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తోంది. డీఎంకే రాజ్యసభ సభ్యుడు పి. విల్సన్ ఈ నియామకంపై మండిపడ్డారు. పరిపాలనలో కనీస అనుభవం లేని ఒక సినిమా నిర్మాతను ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధిగా కూర్చోబెట్టడం వల్ల ఆ పదవికున్న ప్రతిష్ట దెబ్బతింటుందని, జాతీయ స్థాయిలో తమిళనాడు రాష్ట్రం హాస్యాస్పదంగా మారుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంపిక చేసుకునే అధికారం ఉన్నప్పటికీ, అది రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు కాకూడదని హితవు పలికారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించడంలో ఈ ప్రత్యేక ప్రతినిధి పాత్ర ఎంతో కీలకమైనదని విల్సన్ గుర్తుచేశారు. కేంద్ర మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరపడం, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల షెడ్యూళ్లను ఖరారు చేయడం, పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్ర ఎంపీలకు అవసరమైన సమాచారాన్ని, పత్రాలను అందించి అండగా నిలవడం వంటి ఎన్నో గురుతర బాధ్యతలు ఈ పదవి పరిధిలోకి వస్తాయని వివరించారు. అంతటి సున్నితమైన, బాధ్యతాయుతమైన స్థానంలో అనుభవం లేని వ్యక్తిని నియమించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఈ తీవ్ర విమర్శలపై టీవీకే ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.