
విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు స్మగ్లర్లు రోజురోజుకూ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తుగడలను కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు ఏకంగా తమ నడుము చుట్టూ రూ.3.36 కోట్ల విలువైన బంగారం దాచుకుని కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పాలని చేసిన ప్రయత్నం విఫలమైంది.
కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఈ ఇద్దరు ప్రయాణికులపై కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులకు ముందుగానే సమాచారం అందింది. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో విమానం దిగిన క్షణం నుంచే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.
ముందుగా వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపో వడంతో ఇద్దరూ ఏమీ జరగనట్లు హుందాగా బయటకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారి హావభావాలు, నడవడిక అధికారులకు అనుమానం కలిగించాయి. వెంటనే వారిని పక్కకు తీసుకెళ్ళి తమదైన విచారించగా అసలు కథ బయటపడింది. వారు ధరించిన ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన రహస్య పాకెట్లలో తెల్లటి సెలోపేన్ టేపుతో చుట్టిన బంగారం పేస్ట్ను బెల్ట్ మాదిరిగా అమర్చినట్లు అధికారులు గుర్తించారు. స్వర్ణకారుడి సహాయంతో బంగారం పేస్ట్ను వెలికితీసి పరీక్షించగా, అది స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారమని తేలింది.
ఈ ఘటనలో మొత్తం 2.271 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.3.36 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠా, బంగారం ఎవరికి చేరాల్సి ఉంది, దీనికి సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
రష్యా డ్రోన్లకు కాలయముడు: ఉక్రెయిన్ కొత్త AI డ్రోన్ చూశారా!
.