
విశాఖపట్నంలో భూ కబ్జాల పర్వం ఏ స్థాయిలో వుందో, చట్టంలో లొసుగులు ఎలా వున్నాయో చూపించే ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సామాన్యుల స్థలాల సంగతి పక్కనబెడితే..
ఏకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసేసి, కబ్జా చేయడానికి ఒక కేటుగాళ్ల ముఠా స్కెచ్ వేయడం సంచలనం రేపుతోంది. విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతమైన మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
రఘురామకృష్ణరాజు 1989లోనే విశాఖపట్నంలోని ప్రైమ్ ఏరియా అయిన మధురవాడ పరిధిలో 333.33 గజాల స్థలాన్ని చట్టపరంగా కొనుగోలు చేశారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ రూ.2 కోట్లకు పైనే ఉంటుంది. అయితే, ఈ ఖరీదైన స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన కొందరు భూ మాఫియా కేటుగాళ్లు... రఘురామకృష్ణరాజు సంతకాన్ని పక్కాగా ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను సృష్టించారు. అంతేకాదు, ఆ నకిలీ డాక్యుమెంట్లతో సదరు స్థలాన్ని ఒకరి నుంచి ఒకరికి మార్చి మార్చి యాజమాన్య బదిలీ కూడా చేసేశారు.
ఈ దొంగ రిజిస్ట్రేషన్ల వ్యవహారం అంతా సైలెంట్గా సాగిపోయినా, క్షేత్ర స్థాయిలోకి వచ్చేసరికి అసలు విషయం బయటపడింది. ఈ ఏడాది మే 25, 26 తేదీల్లో కొందరు వ్యక్తులు ఆ స్థలంలోకి చొరబడి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు యత్నించారు. దీన్ని గమనించిన రఘురామకృష్ణరాజు స్నేహితుడు ఆయనకు సమాచారం అందించారు. రఘురామ ఒరిజినల్ పత్రాలను, సదరు ముఠా చూపిస్తున్న నకిలీ కాగితాలను లీగల్గా వెరిఫై చేయించగా... తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని నొక్కేయాలని చూసిన వ్యవహారం బయటపడింది.
తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారితో పాటు, ఈ ఫోర్జరీ కథను వెనుక నుంచి నడిపించిన అందరిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రఘురామకృష్ణరాజు ప్రతినిధులు వైజాగ్ పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పీఎంపాలెం పోలీసులు జూన్ 20న అధికారికంగా కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.