
‘ప్రైవేటు’ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1.06 లక్షల మంది విద్యార్థుల చేరిక గతేడాదితో పోల్చితే 58 వేలకు పైగా పెరిగిన ప్రవేశాలు ఈనాడు - అమరావతి రాష్ట్రంలో సర్కారు
బడుల బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య ఊపందుకుంటోంది. 2025-26 విద్యా సంవత్సరంతో పోల్చితే 2026-27లో ఇప్పటివరకు 58,065 మంది విద్యార్థులు అధికంగా చేరటం విశేషం. 2025-26లో 1-10 తరగతుల్లో సర్కారు బడుల్లో 32,01,607 మంది విద్యార్థులు చదవగా.. ఈసారి ఇప్పటివరకు ఈ సంఖ్య 32,59,672కు చేరింది. ప్రైవేటు పాఠశాలల నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు 1,06,914 మంది సర్కారు బడుల్లో ప్రవేశాలు పొందడం గమనార్హం. అయితే వీరిలో పలువురికి ఆయా యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడంతో యూడైస్ప్లస్లో వివరాల నమోదుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. టీసీలు ఇస్తేనే ప్రవేశాల ప్రక్రియ అధికారికంగా పూర్తవుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు 43,626 ఉన్నాయి. గతేడాది కంటే ప్రవేశాల సంఖ్య కనీసం పది శాతం పెంచాలని పాఠశాల విద్యాశాఖ ప్రయత్నిస్తోంది. వేసవి సెలవుల నుంచి ‘బడి పిలుస్తోంది’ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసించే విద్యార్థుల సంఖ్య 35,21,768 దాటాలని భావిస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో 2,62,096 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందాల్సి ఉంది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. జులై 1 నాటికి ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.
ఈ నెల 20 వరకు జరిగిన ప్రవేశాల ఆధారంగానే ఉపాధ్యాయులను అధికారులు సర్దుబాటు చేస్తున్నారు. మొదట మినిమం టైం స్కేల్ కాంట్రాక్టు టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా.. ఇప్పుడు రెగ్యులర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు. ఈ నెల 30లోపు ఈ ప్రక్రియ పూర్తికానుంది. టీచర్లను మొదట మండల స్థాయిలో సర్దుబాటు చేస్తారు. అప్పటికీ మిగులు ఉంటే డివిజన్ స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు.
మార్కాపురం జిల్లా బోడపాడు ప్రాథమిక పాఠశాలలో చేరిన విద్యార్థులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు క్యూ కడుతున్నారు. కూటమి హయాంలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, భోజనం, తల్లికి వందనం అందిస్తుండటంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 70 మందికిపైగా విద్యార్థులు, మార్కాపురం జిల్లా బోడపాడు ప్రాథమిక పాఠశాలలో 100 మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు నుంచి వచ్చి చేరినట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.