
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలను కుదుర్చుకుంది.
ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రమాద బీమాను మొదట సింగరేణిలో ప్రారంభించామనని.. ఇప్పుడు అదే తరహాలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ అమలు చేస్తున్నామని తెలిపారు. పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేము కానీ.. ఆర్థికంగా ఆదుకుని బాసటగా నిలవాలన్నదే తమ ఉద్దేశం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.అలాగే ఉద్యోగులందరికీ ఇన్సూరెన్స్ ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా ఉద్యోగులు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పొందేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. సంస్థ లేదా ప్రభుత్వం కోసం కష్టపడేవారికి అండగా ఉండాల్సిన బాధ్యత యజమానిదేనని ఈ మేరకు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక ఈ పథకం కింద ఉద్యోగులు, కార్మికులకు గరిష్టంగా రూ. కోటి వరకు ప్రమాద బీమా అందించనున్నట్లు పేర్కొన్నారు.ఇప్పటికే సింగరేణి సంస్థకు చెందిన దాదాపు 45 మంది కార్మికులకు ఈ ప్రమాద బీమా సదుపాయాన్ని వర్తింపజేశామని వెల్లడించారు. అలాగే ఇకపై ఉద్యోగులు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు సమస్టిగా పనిచేయాలని.. రోజుకు ఒక గంట అదనంగా పనిచేయాలని కోరారు. అలాగే తనను గుంపుమేస్త్రీ అని చాలామంది అవహేళన చేశారని, అయినా తాను బాధపడనని అన్నారు. ఈ గుంపంతా తనదేనని స్పష్టం చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడినేనని.. హోదా, పదవులు మారినా, ప్రజలతో తనకున్న అనుబంధం మాత్రం మారదని తెలిపారు. తనకు రేవంతన్న అని పిలిపించుకోవడమే అత్యంత ఆనందాన్ని ఇస్తుందని భావోద్వేగం అయ్యారు.