
మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది
గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) భవిష్యత్తుపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కూటమి బుధవారం నాడు నిర్వహించిన వ్యూహాత్మక సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మంది గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీనియర్ నేత జయంత్ పాటిల్ హాజరుకాకపోవడం కూటమిలోని అంతర్గత విభేదాలపై ఊహాగానాలకు బలం చేకూర్చింది. కాంగ్రెస్కు చెందిన నానా పటోలే, విజయ్ వడెట్టివార్ కూడా సమావేశానికి రాలేదు. అయితే, వడెట్టివార్ అనారోగ్య కారణాలతో గైర్హాజరైనట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. కాగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్, శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి ఇటీవల మరో భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేనలో చేరడంతో ఎంవీఏలో అసంతృప్తి మంటలు మరింత రాజుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే నిన్న జరిగిన సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. 'మనం నిజంగానే కలిసి ఉన్నామా?' అని కూటమి నేతలను ఆయన ప్రశ్నించారు. 'మనం కలిసి ఉన్నామని చెబుతున్నాం. కానీ నిజంగా కలిసి ఉన్నామా?, అసెంబ్లీలో ఒకే స్వరంతో మాట్లాడుతున్నామా?, ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాడుతున్నామా?' అని ప్రశ్నించారు. మరోవైపు పార్టీని వీడిన నేతల గురించి స్పందిస్తూ 'మనతో ఉన్నవారిపై దృష్టి పెట్టాలి. వెళ్లిపోయే వాళ్లని వెళ్లిపోనివ్వండి' అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు.
అదే సమయంలో మహారాష్ట్రలో ఎంవీఏ ఇప్పటికీ కీలక రాజకీయ శక్తే అని ఉద్ధవ్ తేల్చి చెప్పారు. కూటమి భాగస్వామ్య పార్టీలు సంయుక్త సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి మన ఐక్యతను ప్రజలకు మరింత బలంగా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆరుగురు ఎంపీల తిరుగుబాటు అంశం చర్చకు రాలేదని సమాచారం. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగింది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎంవీఏ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేన చీలిపోగా.. 2023లో ఎన్సీపీలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి శివసేనలో ఎంపీల వలసలు కూటమికి కొత్త తలనొప్పిగా మారాయి.
2019లో ఏర్పడిన ఎంవీఏ కూటమి మొదటి నుంచే సిద్ధాంతపరమైన విభేదాలతో విమర్శలు ఎదుర్కొంది. కాంగ్రెస్, ఎన్సీపీ వంటి లౌకికవాద పార్టీలతో హిందుత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లిన శివసేన చేతులు కలపడం అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమన్న విమర్శలూ వచ్చాయి. అయితే నాలుగేళ్లుగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటూ వచ్చిన ఎంవీఏ ఇప్పుడు మరికొన్ని కీలక పరిణామాలను ఎదుర్కొంటోంది. వరుస తిరుగుబాట్లు, నేతల అసంతృప్తి, సమావేశాలకు గైర్హాజరు అవుతున్న కీలక నాయకులు వంటి అంశాలు చూస్తే మహా వికాస్ అఘాడి బండి పట్టాలు తప్పే ప్రమాదం ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ముగ్గురితో వివాహేతర సంబంధాలున్నాయి.. విచారణలో అంగీకరించిన బిల్గేట్స్..
పెళ్లి వద్దని చెప్పి ఉండొచ్చు కదా.. ఎందుకు చంపారు: కేతన్ తండ్రి ఆవేదన