
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుచానూరు ఇక భక్తజన సంద్రం కాబోతోంది. ఇక్కడ వెలిసిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కాబోతోన్నాయి.
గురువారం నుండి 29వ తేదీ వరకు అయిదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. పద్మసరోవరంలో కనువిందు చేసే ఈ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో జలవిహారం చేస్తూ భక్తులకు దివ్య మంగళ స్వరూపంలో దర్శనం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు జరిగే ఈ పవిత్ర తెప్పోత్సవాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి 7.30 గంటల వరకు విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరించిన తెప్పలపై స్వామి, అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తారు. ఈ దివ్య వేడుకను దర్శించుకోవడం వల్ల భూలోక కష్టాలు తొలగి, సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
ఈ అయిదు రోజుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు రుక్మిణీ, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు పద్మసరోవరంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తూ, భక్తులను కటాక్షించనున్నారు. 26న రెండో రోజు శ్రీ సుందరరాజస్వామివారు తెప్పపై మూడు పర్యాయాలు విహరించి భక్తకోటికి అభయప్రదానం చేస్తారు. ఈ రెండు రోజుల పాటు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు పద్మసరోవరం వద్ద ఆధ్యాత్మిక సందడిని పెంచనున్నాయి.
ఇక 27 నుండి 29వ తేదీ వరకు చివరి మూడు రోజుల పాటు సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు కరుణిస్తారు. ఇందులో భాగంగా 27న మూడు, 28న అయిదు, చివరి రోజైన 29న ఏడు ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో అమ్మవారికి వైభవంగా తిరుమంజనం జరుగుతుంది.
తెప్పోత్సవాల వేళ తిరుచానూరులో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. 25 నుండి 29 వరకు ఆలయంలో జరిగే కల్యాణోత్సవం, ఊంజల్ సేవలను నిలిపివేశారు. 26న లక్ష్మీపూజను కూడా రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉత్సవ రోజుల్లో రాత్రి వేళల్లో విశేష వాహన సేవలపై అమ్మవారు ఊరేగుతారు. 28వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అమ్మవారు గజవాహనపై తిరుచానూరు మాడవీధుల్లో విహరిస్తారు.
29వ తేదీ రాత్రి 8.30 గంటలకు అమ్మవారు గరుడవాహనపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవం పూర్తయిన తర్వాత ప్రతిరోజూ ఆలయ మాడవీధుల్లో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. ఈ అయిదు రోజుల పాటు తిరుచానూరు పరిసర ప్రాంతాలు భక్తి కీర్తనలతో మార్మోగనున్నాయి. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత కచేరీలు, కోలాటాలు, ప్రవచనాలు ఏర్పాటు చేశారు.