యువత అమెరికా పౌరసత్వం కోసం ఎగబడుతున్న రోజులివి.. గ్రీన్కార్డ్ వస్తే అక్కడే చక్కగా సెటిల్ అవుదామని ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం అలా కాదు..
భారతీయురాలిగానే మాతృభూమిలోనే తుదిశ్వాస విడిచి పెట్టాలనుకున్నారు. అమెరికా పౌరసత్వం వదులుకుని భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాను చనిపోయాక కట్టె ఇక్కడే కాలానిని.. పుట్టిన ఊరిపై మమకారంతో ఈ మట్టిలోనే కలిసిపోవాలని తన చివరి కోరికగా చెబుతున్నారు. 94 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని పుట్టిన గడ్డపై మమకారం చాటుకున్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు బుచ్చయ్య చౌదరి అమెరికాలోని వర్జీనియా పీటర్స్బర్గ్లో డాక్టర్గా స్థిరపడ్డారు. మహాలక్ష్మమ్మ కూడా భర్త నాగభూషణం మరణం తర్వాత అమెరికా వెళ్లగా.. 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది. 2018లో మహాలక్ష్మమ్మత పాటుగా కుమారుడు బుచ్చయ్య చౌదరి కుటంబం ఇండియాకు తిరిగి వచ్చేశారు. బుచ్చయ్య చౌదరి ఎన్ఆర్ఐ కాలేజీలో డైరెక్టర్గా ఉన్నారు. మహాలక్ష్మమ్మ సొంత ఊరు చింతగుంపల వచ్చి ఎనిమిదేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. ఆమెకు తన చివరి శ్వాస సొంతూరులోనే భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలని కోరిక ఉంది. అమెరికా పౌరసత్వం వదులకున్ని ఆమె.. భారత పౌరసత్వం కోసం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.గతంలో మహాలక్ష్మ్మ్మ చేసుకున్న దరఖాస్తులో సాంకేతికంగా తప్పులు ఉండటంతో మళ్లీ సవరించి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఆమె దరఖాస్తు బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరింది. భారత పౌరసత్వం ఇవ్వాలంటే చట్ట ప్రకారం ప్రమాణం చేయాల్సి ఉంటుంది.. బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ మహాలక్ష్మమ్మను పిలిపించి కలెక్టరేట్లో ప్రమాణం చేయించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించి, ఇక్కడి చట్టాలకు లోబడి ఉంటానని ఆమె ప్రమాణం చేశారు. మహాలక్ష్మమ్మ చేసిన ప్రమాణ పత్రంతో పాటుగా, విచారణ ప్రక్రియకుసంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుందని.. అక్కడ నుంచి కేంద్రహోం శాఖకు పంపిస్తారని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఈ దరఖాస్తును కేంద్ర హోంశాఖ అమెరికా ఎంబసీకి పంపిస్తారన్నారు. అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరురాలిగా హోదా దక్కుతుందని కలెక్టర్ తెలిపారు.