పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలతో సంబంధాల నేపథ్యంలో జైపూర్లో అరెస్టయిన జైష్ ఏ మహ్మద్ అనుమానిత స్లీపర్ సెల్ మెంబర్ బబితా ధాకడ్ అలియాస్ ఖదీజా కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. ఏడు రోజులుగా కస్టడీలో ఉన్న ఆమె నుంచి పలు కీలక వివరాలను అధికారులు తెలుసుకున్నారు. ముఖ్యంగా హనీట్రాప్, ఆన్లైన్ రాడికలైజేషన్, యువతులను తీవ్రవాద సంస్థల్లోకి ఆకర్షించే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దర్యాప్తు అధికారుల సమాచారం మేరకు.. బబిత గత రెండేళ్లుగా పాకిస్థాన్లో ఉన్న జైష్ ఏ మహ్మద్కు సంబంధించిన వ్యక్తులతో సంప్రదింపులు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జైష్ ఏ మహ్మద్ సంస్థలో కీలక పాత్ర కోసం ఆమెను సిద్ధం చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఆమె గూగుల్ హిస్టరీ చూసిన అధికారులు విస్తుపోయారు. సూసైడ్ అటాక్స్ ఎలా చేయాలి, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన విషయాలపై ఆమె సెర్చ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇంకా హిడెన్ ఇన్ఫర్మేషన్ కోసం ఆమె ఫోన్లు, డిజిటల్ అకౌంట్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిచారు. భారత సైనిక సిబ్బందితో సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, వారిని హనీ ట్రాప్లోకి లాగేలా బబతకు ట్రైనింగ్ ఇచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎంతమంది సైనిక సిబ్బంది ఈమె హనీ ట్రాప్లో పడ్డారు.. ఎంతదూరం వెళ్లారు అనే వివరాల కోసం ఆమె సోషల్ మీడియా చాట్లు, కాల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కేవలం రాజస్థాన్లోనే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకుని ముఖ్యంగా యువతులను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సోషల్ మీడియా ద్వారా యువతులకు వల వేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పాకిస్థాన్లోని హ్యాండ్లర్లతో వాట్సాప్, ఇతర ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా ఆమె కమ్యూనికేషన్ చేస్తున్నట్లు గుర్తించారు. నిధుల కోసం క్రిప్టో కరెన్సీని ఉపయోగించి ఉంటుందని దర్యాప్తు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బబిత.. ఖదీజా అనే పేరుతో పలు మొబైల్ నెంబర్లు ఉపయోగించిందని.. పని పూర్తయిన తర్వాత చాట్లు, ఫొటోలు, వీడియోలు మొత్తం డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు డిలీట్ అయిన డేటాను రికవరీ చేసే పనిలో పడ్డారు. పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు చెబుతున్నారు.