
ఈనాడు, అమరావతి-విజయవాడ(గాంధీనగర్), న్యూస్టుడే: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, 9, 10 షెడ్యూల్లలో ఉన్న సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం,...
ఈనాడు, అమరావతి-విజయవాడ(గాంధీనగర్), న్యూస్టుడే: ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, 9, 10 షెడ్యూల్లలో ఉన్న సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడం, కేంద్ర ప్రభుత్వం మెమో-57 అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి.
మెమో-57 అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రి లోకేశ్, మంత్రిమండలికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ నిర్ణయంతో దాదాపు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తిస్తుంది. మిగిలిన సీపీఎస్ ఉద్యోగులకూ ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలి.
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 11 వేల మందికి ప్రయోజనం కలుగుతుంది. వీరందరికీ పదవీ విరమణ తర్వాత పెన్షన్ సదుపాయం లభిస్తుంది. 9, 10 షెడ్యూల్లలో ఉన్న గురుకులాలు, సొసైటీల ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం తెలపడం హర్షణీయం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సీఎస్, సంబంధిత అధికారులందరికీ ఏపీ ఐకాస, ఏపీ ఎన్జీవో తరఫున ధన్యవాదాలు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, వేతన సవరణ కమిషన్ ఏర్పాటును ప్రభుత్వం పరిశీలించాలి.
రామకృష్ణ, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
మంత్రివర్గ సమావేశంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 11 వేల మంది ఉద్యోగులకు ఓపీఎస్ అమలుకు ఆమోదం తెలపడంతో ఒక్కో ఉద్యోగికి రూ.3 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది. చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలను చంద్రబాబు తీసుకుంటారు. మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
కేంద్ర ప్రభుత్వ మెమో-57 అమలుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్), ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్), తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం (టీఎన్యూఎస్), ఏపీటీఎఫ్ అమరావతి, స్కూల్ టీచర్స్ అసోసియేషన్, డీఎస్సీ-2003 ఉపాధ్యాయుల ఫోరం హర్షం వ్యక్తం చేశాయి. ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు కావడం ఒక వరమని పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.