సామాజిక సమస్యలు, పర్యావరణ కాలుష్యం గురించి ప్రధానంగా చర్చించే జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ .. తొలిసారిగా ఓ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ దృఢం (Dridam) సినిమా గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ సినిమా కేవలం మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదని., ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన అద్భుతమైన సామాజిక చిత్రమని ఆయన ప్రశంసించారు. "సంచలన విజయం సాధించిన 'దృశ్యం' సినిమాలో చూపించిన సైకలాజికల్ మైండ్ గేమ్, ఉత్కంఠ మిమ్మల్ని ఆకట్టుకుని ఉంటే... ఈ 'దృఢం' కూడా అదే స్థాయిలో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. దీని వెనుక ఒక బలమైన సృజనాత్మక అనుబంధం ఉంది.. 'దృశ్యం' సృష్టికర్త జీతూ జోసెఫ్తో సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన ముఖ్య సహచరుడు మార్టిన్ జోసెఫ్ ఈ 'దృఢం' చిత్రానికి దర్శకత్వం వహించారు. " అంటూ బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు. పైకి ఎంతో ప్రశాంతంగా కనిపించే వాతావరణం వెనుక దాగి ఉన్న ఒక చీకటి నిజాన్ని నెమ్మదిగా, ఉత్కంఠభరితంగా ఆవిష్కరించే శైలి దృఢం సినిమాలో కనిపిస్తుందన్నారు బొలిశెట్టి సత్యనారాయణ. లా అండ్ ఆర్డర్ బాగుపడాలంటే ముందు పోలీస్ వ్యవస్థ అంతర్గత ప్రక్షాళన జరగాలని అభిప్రాయపడ్డారు.మన సమాజ నిజాన్ని ప్రతిబింబించే దృఢం సినిమాను మిస్ కాకుండా చూడాలని బొలిశెట్టి సత్యనారాయణ సూచించారు. మరోవైపు ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్స్టార్ వేదికగా స్ర్టీమింగ్ అవుతోంది.మరోవైపు కృష్ణలంక సాయికృష్ణ అదృశ్యం కేసు వ్యవహారం.. ఈ కేసులో సీఐ నాగరాజుపై ఆరోపణలు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నాయి. ఇలాంటి సమయంలో లా అండ్ ఆర్డర్, పోలీసులు వంటి అంశాలతో ముడిపడిన దృఢం సినిమా గురించి బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు జనసేన పార్టీ సీనియర్ నేతగాఉన్న బొలిశెట్టి సత్యనారాయణ.. ఇటీవల జనసేన నుంచి వైదొలిగారు. వ్యక్తిగత సిద్ధాంతాలను అనుసరించే క్రమంలో.. పదవీ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నట్లు జనసేన పార్టీ అప్పట్లో ప్రకటించింది.