ప్రస్తుత యుగంలో ప్రజల జీవనశైలి శరవేగంగా మారిపోతున్నా.. కొన్ని మారుమూల ప్రాంతాలు మాత్రం వెనకబడిపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు కరెంటు, రోడ్లు, తాగునీరు, బస్సు సౌకర్యం లేకపోవడం...
ప్రస్తుత యుగంలో ప్రజల జీవనశైలి శరవేగంగా మారిపోతున్నా.. కొన్ని మారుమూల ప్రాంతాలు మాత్రం వెనకబడిపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాలకు కరెంటు, రోడ్లు, తాగునీరు, బస్సు సౌకర్యం లేకపోవడం తీవ్ర ప్రశ్నలకు దారితీస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అలాంటి గ్రామాలకు మౌలిక వసతుల కల్పన జరిగితే.. ఆ జనాల్లో వచ్చే ఆనందాలే వేరు. ఇలా కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న వారి దీనస్థితిని చూసి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, సెలబ్రిటీలు రంగంలోకి దిగి.. వారి సమస్యలను పరిష్కరిస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.. బస్సు సర్వీసు ఏర్పాటు చేసి వారి మొహాల్లో చిరునవ్వులు చిందేలా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి వెల్గటూర్ మండల కేంద్రానికి 15 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సును పునరుద్ధరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో వారికి బస్సు సౌకర్యం వచ్చింది. ఈ బస్సు సర్వీసు జగిత్యాల నుంచి ప్రారంభమై.. వయా గొల్లపల్లి, చిల్వకోడూర్, అబ్బాపూర్ మీదుగా వెల్గటూర్ వరకు గతంలో నడిచేది. కానీ ఆ బస్సు సర్వీసును రద్దు చేయడంతో ఆ మార్గంలో ఉండే గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే తమకు తిరిగి బస్సు సౌకర్యం కల్పించాలని.. గత 15 ఏళ్లుగా ఎంతోమందికి విజ్ఞప్తులు, వినతులు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల ప్రజలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కోరగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని వారికి తిరిగి బస్సు సౌకర్యం కల్పించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రోజున అబ్బాపూర్ గ్రామంలో కొత్త బస్సు సర్వీసును మంత్రి అడ్లూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అడ్లూరి.. బస్సు సౌకర్యం కోసం గ్రామస్థులు చాలాసార్లు తనకు విజ్ఞప్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయా గ్రామాల ప్రజల కోరిక మేరకు బస్సు సౌకర్యాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. స్థానిక గ్రామాల ప్రజలు ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. అదే సమయంలో అబ్బాపూర్ గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను కూడా మంత్రి అడ్లూరి ప్రారంభించారు. అదే సమయంలో ఆ గ్రామంలో మూతబడిన పాఠశాల తిరిగి పునరుద్ధరించగా.. దాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ఇక ఆ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించేందుకు తాను ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా గ్రామస్థులు కృషి చేయాలని హితవు పలికారు.