
మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు IMD కీలక హెచ్చరికలు జారీ చేసింది. దాంతో ఐటీ కంపెనీలు, విద్యాసంస్థలను పోలీసులు అప్రమత్తం చేశారు.
ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాల నుంచి విడతల వారీగా ముందస్తు లాగ్ అవుట్స్ ఇవ్వాలని కమిషనరేట్ సూచించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసులు ఈ మేరకు కీలక అడ్వైజరీ జారీ చేశారు.మరోవైపు తెలంగాణ వెథర్ మెన్ కూడా ఈ రాత్రికి హైదరాబాద్ లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేశారు. భాగ్య నగరంలో రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని వెథర్ మాన్ బాలాజీ పేర్కొన్నారు. ఈ సాయంత్రం నాలుగు గంటల నుంచే తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, ఆసీఫాబాద్, అలాగే నాగర్ కర్నూల్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోందని తెలిపారు. దక్షిణ తెలంగాణలో మరికొన్ని గంటల్లో తీవ్ర స్థాయిలో వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. రాత్రంతా ఈ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.అటు తెలంగాణ పోలీసులు కూడా కీలక అడ్వైజరీ జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. త్వరగా విధులు ముగించుకుని ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో సాయంత్రం 4 గంటల నుంచే ఐటీ కారిడార్, ఇతర రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వర్షం స్టార్ట్ కాకముందే ఇంటికి చేరుకోవాలని నగరవాసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో రహదారులు జలమయమైనా, మెట్రో, రైలు సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. సొంత వాహనాల కంటే పబ్లిక్ ట్రాన్స్‌ పోర్ట్ వాడటం వల్ల ట్రాఫిక్ టెన్షన్ తగ్గించుకోవచ్చని సూచించారు.జూన్ 21న హైదరాబాద్ లోని ఎల్బీనగర్, దిల్‌ సుఖ్‌ నగర్, నాంపల్లి, కోఠి, లక్డికాపూల్, పంజాగుట్ట ప్రాంతాల్లో ఉదయం పూట భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్‌ లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అలాగే జూన్ 23 నుంచి హైదరాబాద్‌ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జూన్ 28 వరకు నగరాన్ని వానలు ముంచెత్తనున్నాయని IMD పేర్కొంది.