
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Telangana SBI land Dispute Raidurg: హైదరాబాద్ లో భూములు ప్రతిసారీ రికార్డులను సృష్టిస్తూ ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలోనే హాట్ కేకులాగా మారిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం ఒక పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన భూమి.. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక పెద్ద వివాదానికి కారణమైంది.
రాష్ట్ర ఖజానా నింపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులోని రాయదుర్గం భూములను విక్రయించాలని ప్రయత్నం చేస్తుంటే.. సరిగా 15 సంవత్సరాల క్రితం తాము కొనుగోలు భూమిని ఎలాగైనా కాపాడుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రంగంలోకి దిగింది. రెండు బలమైన వ్యవస్థల మధ్య సాగుతున్న ఈ వివాదం ఏకంగా ఢిల్లీ వరకు చేరింది. వేల కోట్ల విలువైనటువంటి ఈ భూమిని దక్కించుకోవాలని అటు సీఎం రేవంత్ రెడ్డి సైతం నేరుగా రంగంలోకి దిగారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్లిందంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉన్న ప్రభుత్వ ఖాతాలను సైతం రద్దు చేయాలనే ఆలోచన వరకు వెళ్ళింది.
మరోవైపు ఇందులో రాజకీయ కోణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇందులో ప్రతిపక్షాల కుట్ర ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసలు తెలంగాణ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మధ్య జరుగుతున్న రాయదుర్గం భూ వివాదం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎస్బీఐ మధ్య రాజుకున్న ఈ భూ వివాదం ఇప్పుడు దేశ రాజధానిలో సైతం చర్చకు దారి తీసింది. ఈ పంచాయతీని తేల్చేందుకు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఢిల్లీలో రిజర్వు బ్యాంకు పెద్దలతో సైతం మంతనాలు జరుపుతున్నారు. ఇందుకోసం ఢిల్లీకి సైతం వెళ్లారు హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్ గా పేరు సంపాదించుకున్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రాంతంలో సర్వే నంబర్ 83/1 లో ఉన్న సుమారు 5 ఎకరాల స్థలాన్ని టీజీఐఐసీ (TGIIC) ఈ ఏడాది జూన్ ప్రారంభంలో బహిరంగ వేలం వేయడంతో అసలు వివాదం తెరపైకి వచ్చింది.
ప్రభుత్వ వేలంపాటలో భూమి ధర రికార్డు స్థాయి అంటే సుమారు 2500 కోట్లకు పైగా పలకడంతో జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. సుమారు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నేరుగా వచ్చి చేరాయి. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ భూమి తమది అంటూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. ఇది చట్ట విరుద్ధమని నేరుగా హైకోర్టును సంప్రదించడంతో అసలు వివాదం మొదలైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 సంవత్సరంలో తాము 13.33 కోట్ల రూపాయలకు ఈ భూమిని కొనుగోలు చేశామని, ఇక్కడ తాము తమ కార్పొరేట్ భవనాన్ని నిర్మించుకునేందుకు నిధులను సైతం కేటాయించినట్లు కోర్టు ముందు తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకునే నిబంధన ఎక్కడా లేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా భూములను వేలంపాట వేయడం చట్టరీత్యా నేరమని బ్యాంకు కోర్టు ముందు తమ వాదనలను వినిపించింది.
దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా వాదనలకు దిగింది తాము కేటాయించిన స్థలంలో రెండేళ్లలోపు నిర్మాణాలు జరపాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కులు తమకు ఉన్నాయని కోర్టు ముందు తెలిపింది. బ్యాంకు ఈ ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘించడం వల్లనే తాము భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. 2020 సంవత్సరంలోను 2024 లో కూడా పలు సందర్భాల్లో ఇతర సంస్థలకు కేటాయించిన భూములను నిరుపయోగంగా ఉంచడంతో ఇలాగే కేటాయింపులు రద్దుచేసి రాష్ట్ర ప్రభుత్వం భూములను వేలంపాట వేసిందని గుర్తు చేసింది.
అయితే కోర్టు మాత్రం జూన్ 18వ తేదీన బ్యాంకుకు అనుకూలంగా మధ్యంతర తీర్పునిచ్చి వేలం ప్రక్రియను 3 వారాలపాటు స్టే విధిస్తున్నట్లు నిర్ణయించింది. అయితే కోర్టు నుంచి వచ్చిన స్టే రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైన తలనొప్పిగా మారింది అని చెప్పవచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎస్బిఐ పైన ఏకపక్షంగా ప్రతీకార చర్యలు తీసుకునే బాటలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న అకౌంట్లను ఇతర బ్యాంకులకు తరలించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి ప్రభుత్వ ఖాతాలు, సంక్షేమ నిధులు, ప్రభుత్వ ఉద్యోగుల శాలరీ అకౌంట్లు మొదలైనవి ఉన్నాయి. వీటిని ఇతర బ్యాంకులకు షిఫ్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసిన తర్వాతనే ఎస్బిఐ చైర్మన్ రాజకీయ కోణంతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అటు విమర్శ చేస్తోంది. అంతేకాదు ఈ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలని కూడా నిర్ణయించింది. హైదరాబాద్ నగర ఇమేజ్ దెబ్బతీసేందుకు ఇన్వెస్టర్లలో లేనిపోని భయాలను సృష్టించేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీతో కలిసి కొన్ని వర్గాలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వంగ బ్యాంకు పైన ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ చర్యలు మంచిది కాదని ప్రతిపక్ష నేతలు కూడా విమర్శిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో దీనిపైన ఎలాంటి చర్చలు సాగిస్తారు అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. రాబోయే తదుపరి కోర్టు విచారణలో రానున్న న్యాయస్థాన తీర్పుపైనే ప్రస్తుతం ఈ వివాదం మొత్తం కేంద్రీకృతమై ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.