
తెలంగాణలో వెదర్ రూట్ మార్చింది. ఒక పక్క భానుడు తన ప్రతాపం చూపిస్తుంటే, మరోపక్క వరుణ దేవుడు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈ విచిత్రమైన క్లైమేట్ ఛేంజ్ చూసి జనాలు షాక్ అవుతున్నారు.
తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్టేట్కు ఒక చల్లని కబురుతో పాటు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. జూన్ 22 నుంచి ఈనెల 27, 28 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
వాతావరణంలో ఇంత సడన్ చేంజ్ ఎందుకొచ్చిందంటే.. ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి తెలంగాణ మీదుగా ఒక బలమైన ద్రోణి నడుస్తోంది. దీనికి తోడు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల బంగాళాఖాతం నుంచి తెగ తేమ గాలులు రాష్ట్రంలోకి వచ్చేస్తున్నాయి. అందుకే ఈ రేంజ్ లో వాతావరణం అస్థిరంగా మారింది.
ఆల్రెడీ కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షాలు పడ్డాయి. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో 7.4 సెంటీమీటర్లు, జనగామ జిల్లా జఫర్గఢ్లో 6.7 సెం.మీ, రంగారెడ్డి జిల్లా మంచాల బోడకొండలో 6.1 సెం.మీ వాన దంచికొట్టింది. వికారాబాద్ జిల్లా పెద్యూముంతల్లో 5.4 సెం.మీ, సంగారెడ్డి జిల్లా ఝరాసంఘంలో 5.1 సెం.మీ, నల్గొండ జిల్లా తిమ్మాపూర్లో 5 సెం.మీ చొప్పున వర్షపాతం రికార్డయింది.
• సోమవారం : మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. కానీ, ఇదే టైంలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాలులు కూడా వీస్తాయి. ఆల్రెడీ 102 మండలాల్లో హీట్వేవ్ నడుస్తోంది, అందులో 33 మండలాల్లో పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది.
• మంగళవారం: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వానలు ఉన్నాయి.
• జూన్ 25 - 26: ఈ రెండు రోజులు వానల పీక్ స్టేజ్ అనొచ్చు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వానలు దంచికొడతాయి.
తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణం సడన్ గా యూ టర్న్ తీసుకుంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరుతో పాటు రాయలసీమ ఏరియాల్లో ఆకాశం మేఘావృతమై ఉండి, పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. గాలిలో తేమ పెరిగి ఎండలు కాస్త తగ్గుముఖం పడతాయని చెప్పారు.
రాబోయే ఆరు రోజులు వాతావరణం చాలా క్రేజీగా, అస్థిరంగా ఉంటుంది కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాలి. వానలు పడేటప్పుడు బలమైన ఈదురుగాలులు వీస్తాయి, పిడుగులు పడే ముప్పు కూడా చాలా ఎక్కువగా ఉంది. వర్షం పడేటప్పుడు అస్సలు చెట్ల కింద నిల్చోవద్దు. పాత ఇళ్లు, బలహీనమైన షెడ్లు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ హోర్డింగుల కింద అస్సలు ఉండకండి. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల జోలికి వెళ్లొద్దు. తడి నేల, గడ్డి వల్ల కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడకపోవడం చాలా మంచిదని అధికారులు తెలిపారు.