
విజయ్ ఆంటోని తమిళ హీరోనే కాదు, టాలీవుడ్ హీరోగానూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయన సినిమాలు తమిళంతోపాటు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. మంచి ఆదరణ పొందుతుంటాయి. ఇప్పుడు సరికొత్త కథాంశంతో `వంద దేవుళ్ళు` అనే చిత్రం చేశాడు. ఇందులో ఆయన ప్రధాన పాత్రలో నటించడంతోపాటు నిర్మించడం విశేషం.
శశి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోనితోపాటు శ్వాసిక విజయ్, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస, కరుణాల్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ మూవీని జూన్ 19న శుక్రవారం విడుదలైంది.
మరి సినిమా ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం . వాసుకి (శ్వాసిక విజయ్)కు ఇద్దరు పిల్లలు భాస్కర్(అజయ్ ధీషన్), వివేక్(శక్తి). పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భర్త చనిపోతాడు. భర్త లేకపోవడంతో ఊర్లో అందరి చూపు వాసుకిపైనే పడుతాయి.
దీంతో ఆమె చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంది. ఆ బాధని దిగమింగుతూ కష్టపడి పనిచేసి పిల్లల్ని చదివించుకుంటుంది. పిల్లలు పెద్దగా అవుతారు. దీంతో తనకు రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వస్తుంది. ఈ విషయాన్ని ఆ ఊర్లో ఉండే స్కూల్ టీచర్ వద్ద వెల్లడిస్తుంది.
ఆ టీచర్ వాసుకి పెద్ద కొడుకు భాస్కర్తో చెప్పగా, ఆయన తిరస్కరిస్తాడు. అమ్మపై కోప్పడతాడు. దీంతో పెళ్లి అనే ఆలోచన్ని వదిలేసుకుంటుంది వాసుకి. ఇక భాస్కర్, వివేక్ పెద్ద అయి జాబ్లు చేస్తుంటారు. ఆ సమయంలో భాస్కర్కి అమ్మకి మళ్లీ పెళ్లి చేయాలనే ఆలోచన వస్తుంది.
అప్పటికే వివేక్ సంధ్య(లిజో మోల్ జోస్)తో ప్రేమలో ఉంటాడు, భాస్కర్ కూడా అమ్మకి పెళ్లి చేయడం కోసం వందన(కావ్య అనిల్)ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతాడు. అయితే అమ్మ పెళ్లి చేసుకుంటేనే తాను చేసుకుంటానని పట్టుబడతాడు. మరి అమ్మ రెండో పెళ్లికి ఒప్పుకుందా?
వాసుకి రెండో పెళ్లి అంటే ఊర్లో చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఇందులో ఏడుకొండలు(విజయ్ ఆంటోని) కథేంటి? వాసుకిని ఏడుకొండలు పెళ్లి చేసుకున్నాడా? ఈ క్రమంలో వీరు ఎలాంటి పోరాటం చేయాల్సి వచ్చిందనేది మిగిలిన కథ.
సాధారణంగా ఒంటరిగా ఉన్న మగాళ్లు రెండో పెళ్లి చేసుకోవడం చూశాం. `మా నాన్నకు పెళ్లి` అనే సినిమా కూడా వచ్చింది. మగాళ్లు ఏజ్తో సంబంధం లేకుండా రెండో పెళ్లి చేసుకోవడం మన సమాజంలో కామన్గానే మారింది. అయితే భర్తలు చనిపోయిన మహిళలు రెండో పెళ్లి అనే యాంగిల్ని మనం చూడలేదు. పిల్లలు పెద్దగా అయిన మహిళలు ఒంటరిగానే ఉంటారు, కానీ ఇందులో నలభై ఏళ్లు దాటిన తర్వాత ఒక ఒంటరి మహిళ మళ్లీ పెళ్లికి సిద్ధమవడం, ఈ క్రమంలో ఇంట్లో పిల్లల నుంచి, బయట సమాజం నుంచి, ఊర్లో నుంచి ఎలాంటి రియాక్షన్స్ వచ్చాయి? అందుకోసం ఆమె ఎంతటి స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందనేదే ఈ మూవీ. మగాడిని రెండో పెళ్లికి అంగీకరించే ఈ సమాజం, అదే ఆడది రెండో పెళ్లి చేసుకుంటే అంగీకరించరు? పెళ్లైన ఏడాదికే భర్త చనిపోతే జీవితాంతం ఆమె ఒంటరిగానే ఉండాలా? లైఫ్ లాంగ్ విధవరాలిగానే ఉండిపోవాలా? ఇది మారాలి? ఆ మార్పు ఈ సినిమాలోని ప్రధాన పాత్ర ద్వారా రావాలనే మంచి సందేశంతో ఈ సినిమాని రూపొందించారు విజయ్ ఆంటోని. దీనికి ఆయనే నిర్మాత కావడం విశేషం. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందించారు.
అయితే సినిమాగా ఇది ప్రారంభంలో ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం, ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న అమ్మ పడే బాధలు, ఫేస్ చేసే ఇబ్బందులను ప్రధానంగా చేసుకొని చూపించారు. పిల్లల కోసం కష్టపడటం, ఈ క్రమంలో అవమానాలు ఫేస్ చేయడం, ఒంటరిగా ఉండటంతో ప్రతి మగాడు ఆమెని అనుభవించాలనుకోవడం వంటివి హృదయాన్ని కదిలిస్తాయి. ఆ తర్వాత తనకు పెళ్లి చేసుకోవాలనే కోరిక కలగడం, పిల్లలు వ్యతిరేకించడం వంటి సన్నివేశాలతో రన్ అవుతుంది. డ్రామా ప్రధానంగా వెళ్తుంది. అదే సమయంలో కొంత డ్రైగా ఉంటుంది. స్లోగా అనిపిస్తుంది. సెకండాఫ్ తర్వాత కథ పుంజుకుంటుంది. విజయ్ ఆంటోనీ ఎంట్రీతో సినిమా రసవత్తరంగా మారుతుంది. లవ్ ట్రాక్, కామెడీ, ఎమోషన్స్ మేళవింపుగా వెళ్తుంది. చివరి అరగంట మరింత రక్తికట్టించేలా ఉంటుంది. ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఎమోషనల్గా, అదిరిపోయే ట్విస్ట్ తో ముగుస్తుంది. ఎంచుకున్న పాయింట్ బాగుంది.
అయితే ప్రారంభంలో దాన్ని అంతే కన్విన్సింగ్గా తీయలేకపోయారు. రెండో పెళ్లికి సంబంధించిన బలమైన సీన్లు చూపించలేదు. ఎమోషన్ మిస్ అయ్యింది. అయితే మనిషికి, తిండి, నిద్రతోపాటు తోడు(శరీరక అవసరం) కూడా ముఖ్యమనే విషయాన్ని చెప్పిన తీరు బాగుంది. సినిమా చాలా వరకు డ్రైగా వెళ్తుంది. సంఘర్షణ పాళ్లు తగ్గాయి. అదే సమయంలో ఎమోషనల్ సీన్లలో డోస్ తగ్గింది. కారణాలను మరింత బలంగా చూపించాల్సింది. కమర్షియల్ ఎలిమెంట్లు మిస్ అయ్యాయి. కాకపోతే భర్తలు చనిపోయిన మహిళలకు మళ్లీ లైఫ్ ఉందని, వాళ్లు జీవితాంతం ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పే సందేశం బాగుంది. ఇలాంటి పాయింట్తో సినిమా తీసిన విజయ్ ఆంటోనిని అభినందించాలి.
వాసుకి పాత్రలో శ్వాసిక విజయ్ అదరగొట్టారు. ఆమె మనసులో బాధని దాచుకొని బయటకు ఆనందంగా కనిపించి, తన భావాలను వ్యక్తం చేయలేక లోలోపల మదనపడే మహిళగా అద్భుతంగా చేసింది. నిజానికి ఈ మూవీకి ఆమెనే హీరో. పాత్రలో జీవించి ఆకట్టుకుంది. భాస్కర్ పాత్రలో అజయ్ ధీషన్ చాలా బాగా నటించాడు. సెటిల్డ్ గా చేసి మెప్పించాడు. చాలా మెచ్యూర్గా నటించి ఆకట్టుకున్నాడు. సినిమాకి సెకండ్ హీరో అని చెప్పొచ్చు. వివేక్ పాత్రలో శక్తి నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఏడుకొండలుగా విజయ్ ఆంటోని కనిపిస్తాడు. ఆయన సెకండాఫ్లో వస్తాడు. ఆయన పాత్రకి పెద్దగా ప్రయారిటీ లేదు, కానీ ఆయన వచ్చాకే సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఉన్నంత సేపు అదరగొట్టాడు, వాహ్ అనిపించాడు. మిగిలిన వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
సినిమాకి బాలాజీ శ్రీరామ్ మ్యూజిక్ బాగుంది. కొత్తగా ఉంది. పాటలు ఆకట్టుకోవడంతోపాటు ఆర్ఆర్ కూడా అంతే బాగుంది. సినిమాకి అది ప్లస్ అయ్యింది. ఎస్ బి దర్శన్ కిర్లోష్ కెమెరా వర్క్ కనువిందుగా ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా మూడ్ని రిప్లెక్ట్ చేసేలా విజువల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ పరంగానూ బాగుంది. నీట్గా మూవీ సాగింది. దర్శకుడు శశి ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. అయితే ఇదొక సెన్సిటివ్ టాపిక్. కమర్షియాలిటీ తక్కువ ఉన్న మూవీ. అదే పెద్ద మైనస్. కాకపోతే అంశాలను చాలా వరకు కన్విన్సింగ్గా రూపొందించాడు. ఒక కొత్త యాంగిల్లో ఈ కథని చెప్పిన తీరు బాగుంది. ఇదొక మంచి ప్రయత్నంగా నిలుస్తుంది. కమర్షియల్గా ఇది ఎంత వరకు వెళ్తుందనేదే డౌట్.
అమ్మకి మళ్లీ పెళ్లి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అభినందనీయమైన ప్రయత్నంగా చెప్పొచ్చు.