
ప్రభుత్వ వైద్య రంగంలోని లోపాలను, తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఉదంతం తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన 20 ఏళ్ల దాట్ల వనజ అనే గర్భిణికి గత ఆదివారం తెల్లవారుజామున ప్రసవ వేదన మొదలైంది.
అంబులెన్స్ సేవలు సకాలంలో అందకపోవడం, ఆశా వర్కర్ ఆలస్యంగా రావడం వంటి ఇబ్బందుల నడుమ ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, అక్కడ ఉన్న నర్సే ప్రసవం చేసింది.
దురదృష్టవశాత్తూ పుట్టిన వెంటనే శిశువు మరణించగా, ఆ తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఆమె కూడా కన్నుమూసింది.ఈ విషాదం అనంతరం బుధవారం అంత్యక్రియలు ముగించి, బంధువులు ఆ బూడిదను సేకరిస్తుండగా చితాభస్మంలో శస్త్రచికిత్సకు ఉపయోగించే ఒక కత్తెర బయటపడింది.
వనజకు ఎలాంటి సిజేరియన్ ఆపరేషన్ చేయనప్పుడు, ఈ సర్జికల్ కత్తెర ఆమె శరీరంలోకి ఎలా వచ్చిందనే ప్రశ్నలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ప్రసవం తర్వాత జరిగిన రక్తస్రావాన్ని అరికట్టే ప్రయత్నంలో గానీ, లేదా మాయను తొలగించే క్రమంలో గానీ ఆసుపత్రి సిబ్బంది పొరపాటున కత్తెరను ఆమె గర్భాశయంలోనే మర్చిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
ఈ నిర్లక్ష్యమే ఆమె ప్రాణాలు పోవడానికి కారణమని ఆరోపిస్తున్నారు.ఈ ఊహించని పరిణామం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయడంతో ఉన్నతాధికారులు స్పందించి, గుండాల ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ను