
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్ కుమార్కు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల అనంతరం అధికారులు ఆయన్ను చంచల్గూడ కేంద్ర కారాగారానికి తరలించారు.జూన్ 18న సునీల్ నివాసం, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
తన తండ్రి పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ పలుకుబడిని ఉపయోగించి మద్యం రవాణా కాంట్రాక్టుల ద్వారా సునీల్ భారీగా లబ్ధి పొందారని, తద్వారా మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.విచారణ సందర్భంగా, సుదర్శన్ కన్స్ట్రక్షన్స్కు చెందిన సందీప్, ప్రతాప్ రెడ్డిలతో సంబంధం ఉన్న సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించడంలో భారీ అవకతవకలు జరిగాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వ్యవహారంలో సునీల్ సుమారు రూ.28 కోట్ల మేర కిక్బ్యాకులు అందుకున్నారని, మరో రూ.7 కోట్ల విలువైన కుటుంబ లావాదేవీలను గుర్తించామని తెలిపారు.
ఈ కుంభకోణం కారణంగా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.195 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ అభియోగాలు మోపింది.వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా, పంపిణీ కాంట్రాక్టులలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి ఈడీ గత కొంతకాలంగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో సునీల్ కుమార్ అరెస్ట్ ఒక కీలక పరిణామంగా మారింది.
ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది
.