
2024 ఎన్నికల విజయం తెలుగు నేలపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ స్పష్టం చేశారు.
ఈ విజయంలో ప్రవాసాంధ్రుల కృషిని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావిస్తుంటారని తెలిపారు.
వాషింగ్టన్: 2024 ఎన్నికల విజయం తెలుగు నేలపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకున్న ప్రతి తెలుగువాడిదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే, టీడీపీ నేత గాలి భాను ప్రకాశ్ తెలిపారు. ఈ విజయంలో ప్రవాసాంధ్రుల కృషిని సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం ప్రస్తావిస్తుంటారని చెప్పారు. అమెరికా రాజధాని ప్రాంతంలోని వర్జీనియా వేదికగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్తో ప్రవాస తెలుగు వారితో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ సమర్ధ నాయకత్వంలో పలు రంగాలలో రాష్ట్రాభివృద్ధి చెందుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మంత్రి నారా లోకేశ్ చొరవతో నూతన సంస్కరణలతో విద్య రంగం పురోగామి దిశగా అడుగులు వేస్తుందన్నారు. ఇటీవలి విడుదలైన పదో తరగతి ఫలితాలే అందుకు నిదర్శనమని ఆయన సోదాహరణగా వివరించారు. ప్రజాభిమానం తోడుగా నగరి నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నుంచి ఈనాటి వరకూ దశాబ్దాలుగా విలువలతో కూడిన ప్రజాసేవలో తాము ముందుకు సాగుతున్నామన్నారు. 2029 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పని చేద్దామని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాను ప్రకాశ్ పిలుపునిచ్చారు.
తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన మాట్లాడుతూ.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజకీయ జీవితం అందరికి మార్గదర్శకమని పేర్కొన్నారు. యువ శాసనసభ్యుడిగా ప్రజాసేవలో ఆ వారసత్వాన్ని, విజయాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యే భానుప్రకాశ్కు ఆయన సూచించారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ పిలుపు మేరకు ఎల్లప్పుడూ టీడీపీ విజయమే తమకు శిరోధార్యం అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా మాగులూరి భానుప్రకాశ్ వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో యాశ్ బొద్దులూరి, సుధీర్ కొమ్మి మాట్లాడుతూ మాతృభూమి, మాతృబాష తమకు రెండు కళ్ళుగా ప్రవాస తెలుగు వారు పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తమ వంతు సహకారం, తోడ్పాటు ఎల్లప్పుడూ అందిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో విజయమే నేడు జరుగుతున్న అభివృద్ధికి కొనసాగింపు అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి వారంతా ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో ప్రవాస తెలుగు వారి పాత్ర, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న అభివృద్ధి, సమర్ధ నాయకత్వం, కేంద్రప్రభుత్వ సహకారం.. ఇలా పలు అంశాలపై పలువురు ప్రవాస తెలుగువారు తమ అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాసరెడ్డి భూమిరెడ్డి, సత్యనారాయణరాజు, మాధవనాయుడు బోయెల్ల, ప్రదీప్ గుత్తా, సీతారామారావు యెండూరి, చంద్రనాథ్, వెంకట రెడ్డి, వెంకటేశ్వర రావు సామినేని, అమరలింగం, సుదర్శన్, సుబ్బారెడ్డి, సుబ్బారావు, వీరభద్రరావు, సురేశ్, భిక్షపతి, శంకరరావుతోపాటు పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
నెదర్లాండ్స్లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు