ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకునేందుకు, ప్రైవేటు పాఠశాలల మోజులో పడి సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తున్న తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చేందుకు ఒక గ్రామ పంచాయతీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా ఒక అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులకు, ఆయా ఇళ్లకు సంబంధించిన వార్షిక ఇంటి పన్ను, నల్లా బిల్లులను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటన చేసింది.ప్రస్తుతం బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 62 మంది విద్యార్థులుండగా.. ఉన్నత పాఠశాలలో ఆ సంఖ్య కేవలం 23కి పడిపోయింది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధ్యాయుల కొరతతో పాటు, భవిష్యత్తులో స్కూల్ పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా హైస్కూల్లో విద్యార్థుల సంఖ్యను భారీగా పెంచాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచి వేముల శ్రీకాంత్ అధ్యక్షతన ఆరుగురు వార్డు సభ్యులు అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. ప్రభుత్వ బడికి పిల్లలను పంపే కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగిస్తూ పన్నులు మాఫీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ ప్రత్యేక రాయితీ ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం పూర్తయ్యే వరకు వర్తిస్తుందని సర్పంచ్ వేముల శ్రీకాంత్ స్పష్టం చేశారు.
గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లేదా ఉన్నత పాఠశాల.. ఈ రెండింటిలో ఏ బడిలో పిల్లలను చేర్చినప్పటికీ ఆయా కుటుంబాల ఇంటి పన్ను, నల్లా బిల్లుల రద్దు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేవలం పన్నుల మినహాయింపు మాత్రమే కాకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కుటుంబాలకు భవిష్యత్తులో గ్రామ పరిధిలో అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలలో సైతం మొదటి ప్రాధాన్యత కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు
పాలకవర్గం వెల్లడించింది.గ్రామ పంచాయతీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియా వేదికగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు, పంచాయతీ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి ఈ పన్నుల మాఫీ పథకం గురించి వివరిస్తున్నారు. ఈ వినూత్న ఆఫర్ ప్రకటించిన అతి తక్కువ సమయంలోనే ఇప్పటికే 12 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా అడ్మిషన్లు పొందడం విశేషం. మరికొందరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చేర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. విద్యా వ్యవస్థను రక్షించుకోవడానికి గ్రామీణ స్థాయిలో తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారడమే కాక.. రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు రోల్ మోడల్గా నిలుస్తోందని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు.