
నీట్ పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ను బస్సు సిబ్బందికి చూపిస్తే ఉచితంగా ప్రయాణించవచ్చు. పరీక్షా రోజున విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఇతర పట్టణాలు, నగరాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించిన విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
APSRTC పరిధిలో నడిచే పలు సాధారణ సర్వీసుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం వర్తించనుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో విద్యార్థులు ఎటువంటి చార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు.
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలకు ప్రత్యేక సూచనలు పంపినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులను నడపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక పర్యవేక్షకులను నియమించడంతో పాటు ప్రధాన బస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే అదనపు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రతి ఏడాది వేలాది మంది విద్యార్థులు నీట్ పరీక్ష కోసం దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తోంది.
దీంతో కుటుంబాలపై అదనపు ఖర్చు భారం పడుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణ వ్యయాన్ని తగ్గించడమే కాకుండా విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇది ఒక ప్రోత్సాహక చర్యగా భావిస్తున్నారు.
గతంలో జరిగిన వివాదాల నేపథ్యంలో ఈసారి నీట్ పరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షకు సంబంధించిన తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు ముందుగానే తమ ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకుని, హాల్ టికెట్తో APSRTC ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం కోరుతోంది
.