హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ఆలస్యంపై.. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం ఎల్ అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
దానికోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)ను లోన్ ఇవ్వాలని కోరామని.. తీరా అది మంజూరు అయ్యేసరికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డు పడ్డారని ఆరోపించారు. సచివాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..
కిషన్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణకు ఎల్అండ్టీ ఒప్పుకోవడం లేదని.. తొలి దశ మెట్రోతోనే ప్రతీ సంవత్సరం రూ. 400 కోట్ల నష్టాలు వస్తున్నట్లు ఆ సంస్థ చెప్పిందని పేర్కొన్నారు.ఎల్అండ్టీ నుంచి మెట్రోను కొనుగోలు చేస్తేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పిందని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ఈ కొనుగోలులో యూపీ మెట్రో ఎండీ సుశీల్ కుమార్ను కూడా సభ్యుడిగా పెట్టినట్లు తెలిపారు. రూ. 30 వేల కోట్ల ఎల్అండ్టీ ఆస్తుల్ని రూ. 15 వేల కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్ కు రూ. 350 కోట్ల నిర్మాణ ఖర్చవుతుందని అంచనాలు ఉన్నాయని పేర్కొన్నారు.
మెట్రో రైల్ నిర్మాణంలో గత సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. మెట్రోను 3 ఏళ్లు ఆలస్యం చేయడంతో రూ. 7 వేల కోట్ల అంచనాలు కాస్తా.. రూ. 22 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. మెట్రో కూడా రైల్వే కిందికి వస్తుందని అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని అప్పు అడిగినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి..
ఐఆర్ఎఫ్సీ రుణం కోసం అంతా సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆ లోన్ వచ్చే సమయానికి సరిగ్గా కిషన్ రెడ్డి అడ్డు తగిలారని ఆరోపించారు. మే 30వ తేదీనే కేంద్రం నుంచి రూ. 13,600 కోట్ల రుణం రావాల్సి ఉన్నా.. కిషన్ రెడ్డి రానీయకుండా చేశారని
దుయ్యబట్టారు. కేవలం 4 శాతం వడ్డీతో రుణం అప్రూవ్ చేసుకుంటే.. దాన్ని రాకుండా చేశారని మండిపడ్డారు. దానికి పేపర్ ఫీజు కింద రూ. 84 కోట్లు.. ఈక్విటీ రూ. 1400 కోట్లు కూడా చెల్లించినట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు.గత నెల 21వ తేదీన కిషన్ రెడ్డి.. మరో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసి తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా అని నిలదీసి.. ఆ రుణం రాకుండా ఆపేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సమస్యలపై మాట్లాడుదాం అంటే కిషన్ రెడ్డి సమయం ఇవ్వరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని.. కేటీఆర్ చెప్పిందే కిషన్ రెడ్డి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జపాన్ నుంచి నిధులు వచ్చినా కేంద్రం తెలంగాణకు ఇవ్వడం లేదని తెలిపారు. ఇది చూస్తూనే తెలంగాణపై కేంద్రానికి ఎంత వివక్ష ఉందో అర్థం అవుతోందని అన్నారు.ఇప్పటికైనా హైదరాబాద్ మెట్రోకు నిధులు ఇప్పించి, ఎన్ఓసీ ఇస్తే కిషన్ రెడ్డికి శాలువా కప్పి సన్మానం చేస్తామని రేవంత్ తెలిపారు. కేంద్రం భాగస్వామ్యం లేకుండా రూ. 40 వేల కోట్లతో మెట్రో విస్తరణను రాష్ట్ర ప్రభుత్వమే చేసుకుంటామని ఎన్ఓసీ ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదని వాపోయారు. కేంద్రం నుంచి నిధులు ఇప్పించకపోయినా.. ఎన్ఓసీ అయినా ఇప్పించాలని పేర్కొన్నారు. మెట్రో విస్తరణపై ఇప్పటికైనా కిషన్ రెడ్డి బాధ్యత చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.