
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల గురించి ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఇక, పర్యటన మొదటి రోజున ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ YCH లాజిస్టిక్స్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ సునీల్ నంబియార్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటు, ఆధునిక సాంకేతికతతో కూడిన మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటెడ్, అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారీ సప్లై చైన్ సిటీని ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా ఇరు వర్గాలు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాన్ని దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్కు వెయ్యి కిలోమీటర్లకు పైగా సుదీర్ఘ సముద్ర తీరం ఉందని తెలిపారు. లాజిస్టిక్స్ రంగ అభివృద్ధికి అనువైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు పెట్టుబడిదారులకు అనేక అవకాశాలను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.
లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఆక్వాకల్చర్ రంగంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు.
వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ ద్వారా ఎగుమతులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. లాజిస్టిక్స్ మాత్రమే కాకుండా ఉత్పత్తి రంగంలో కూడా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పెట్టుబడి అనుకూల విధానాలు, మౌలిక సదుపాయాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని, ఆంధ్రప్రదేశ్ను సందర్శించి పెట్టుబడులు పెట్టాలని ప్రముఖ సంస్థల
ప్రతినిధులను ఆహ్వానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..