తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవింగ్ పరీక్షా కేంద్రాలలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
అంతకుముందు అవినీతి నిరోధక శాఖ నిర్వహించిన ఆకస్మిక సోదాలలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ కార్యాలయాలలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా.. ప్రైవేట్ దళారుల ద్వారా అక్రమ మార్గాల్లో డ్రైవింగ్ లైసెన్సులు జారీ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.
దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ లైసెన్సింగ్ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించారు.ఏసీబీ తనిఖీలలో తేలిన వివరాల ప్రకారం.. అనేక ప్రాంతాలలో డ్రైవింగ్ పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించకుండా కేవలం మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు.
మరికొన్ని చోట్ల అసలు పరీక్షలతో పనే లేకుండా, అభ్యర్థులు కనీసం టెస్ట్ ట్రాక్ వద్దకు రాకపోయినా నేరుగా లైసెన్సులు మంజూరు చేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. దీంతో పాటు ఆర్టీవో ఆఫీసుల లోపల, టెస్ట్ ట్రాక్ల వద్ద ప్రైవేట్ ఏజెంట్లు, బ్రోకర్ల సంచారం మితిమీరిపోయినట్లు తేలింది.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఉన్నతాధికారులు ఎవరైనా ఆకస్మిక తనిఖీలకు వస్తే స్థానిక సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఆర్టీవో కార్యాలయాల్లో కొన్ని ప్రత్యేక రహస్య కోడ్లను వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా నెట్వర్క్ ద్వారా తనిఖీ అధికారుల సమాచారం ముందే లీక్ అవుతున్నట్లు ఏసీబీ నివేదికలో స్పష్టమైంది.ఈ ఉల్లంఘనలను రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.
చంద్రశేఖర్ గౌడ్ తీవ్రంగా పరిగణించారు. లైసెన్సింగ్ ప్రక్రియలో పూర్తి పారదర్శకతను తీసుకురావడానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి డ్రైవింగ్ ట్రాక్ ఇన్ఛార్జ్లందరికీ ఆదేశాలను జారీ చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన తేదీన ఖచ్చితంగా డ్రైవింగ్ ట్రాక్ వద్ద వ్యక్తిగతంగా హాజరుకావాలి.
నిర్దేశిత డ్రైవింగ్ పరీక్షను పూర్తి చేయాలి. వాహనాన్ని స్టార్ట్ చేయడం, ఆపడం, రివర్స్ తీయడం, సిగ్నల్స్ పాటించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. కేవలం వాహనం స్టీరింగ్ పట్టుకుని కూర్చుంటే చాలు పాస్ మార్కులు వేసే పాత పద్ధతులను పూర్తిగా నిషేధించారు. పరీక్షల సమయంలో డ్రైవింగ్ ట్రాక్లలో ఉన్న సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని విజిలెన్స్ విభాగం ఆదేశించింది. నిఘా వ్యవస్థను ఆపినా లేదా రికార్డింగ్లతో హ్యాకింగ్ చేయాలని చూసినా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రైవేట్ ఏజెంట్లు, బ్రోకర్లు, డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధులు ఎవరూ ఆర్టీవో కార్యాలయాల్లోకి రాకుండా నిషేధించారు.
పరీక్ష ప్రారంభించడానికి ముందే అభ్యర్థి గుర్తింపును ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా నిరూపించుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు