
ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. తమన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'ఓజీ టూర్ ఇండియా' (OG Tour India) లైవ్ కన్సర్ట్కు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. హైదరాబాద్లోని బౌల్డర్ హిల్స్లో శనివారం జరగాల్సిన ఈ కార్యక్రమం ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ షోను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.శనివారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా కన్సర్ట్ ప్రాంగణం జలమయమైంది. వర్షం ధాటికి కొన్ని సంగీత పరికరాలు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. సాయంత్రం 6:30 గంటలకు షో ప్రారంభం కావాల్సి ఉండగా, వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ షో రద్దు కావడంపై తమన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఈ వార్త నా హృదయాన్ని ముక్కలు చేసింది. గత 45 రోజులుగా నా టీమ్లోని 56 మంది సభ్యులు ఈ ఈవెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. ఆయనపై నాకు పూర్తి నమ్మకం ఉంది. అభిమానుల ప్రేమతో మరింత బలంగా తిరిగి వస్తాను" అని ఆయన భావోద్వేగంగా పోస్ట్ చేశారు.పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'దే కాల్ హిమ్ ఓజీ' (They Call Him OG) చిత్ర సంగీతాన్ని పురస్కరించుకుని ఈ టూర్ను నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ కన్సర్ట్ తొలుత జూన్ 6న జరగాల్సి ఉండగా, అప్పుడు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే వాయిదా పడింది
.