తెలంగాణ పోలీసు శాఖ మరో ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. పాస్పోర్ట్ దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలంగాణ పోలీసులను 'ఇన్స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ ఫర్ స్టేట్ పోలీస్ (2025-26)'కు ఎంపిక చేసింది.పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా పూర్తి చేస్తున్నందుకు ఈ గుర్తింపు లభించింది. ఈ నెల 19న ఢిల్లీలో నిర్వహించనున్న 'పాస్పోర్ట్ సేవా దివస్' వేడుకల్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ చేతుల మీదుగా రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.తెలంగాణ పోలీసులు వెరిఫికేషన్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'వెరిఫాస్ట్' మొబైల్ యాప్ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దరఖాస్తుల పరిశీలనలో జాప్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రక్రియ అంతటా పారదర్శకతను పెంచారు. జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఈ వినూత్న విధానం, పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో తెలంగాణ పోలీసుల అంకితభావానికి నిదర్శనంగా నిలుస్తోంది
.