గిరిజన మహిళలకు అండగా నిలిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే పవన్ కళ్యాణ్.. అడవితల్లి బాట కార్యక్రమం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అరకులోయలో సొంత నిధులతో వారి కోసం బ్లడ్ బ్యాంక్ నిర్మిస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మత్స్యలింగం, ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, కలెక్టర్ నిషాంతి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న గిరిజన మహిళల వెతలను తీర్చేందుకు.. పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు సొంత నిధులతో ఈ బ్లడ్ బ్యాంక్ నిర్మాణానికి సంకల్పించారు. బెంగళూరుకు చెందిన బీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థ ఈ నిర్మాణ పనులు చేపట్టనుంది. మహిళల మాటలకు కదిలిపోయిన పవన్ కళ్యాణ్.. అడవితల్లి బాట కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ గతేడాది అరకు నియోజకవర్గంలో పర్యటించారు. కురిడీ అనే గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న గిరిజనులతో మాటామంతీ నిర్వహించారు. ఈ సమయంలో ఓ మహిళ రక్తహీనతతో తాము పడుతున్న ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ ఎదుట వాపోయారు. జన్యుపరంగా వచ్చే ఈ సమస్య.. తమ ప్రాంతంలోని గర్భిణుల ప్రాణాలను బలి తీసుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వారి మాటలకు కదిలిపోయిన పవన్ కళ్యాణ్.. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని మాట ఇచ్చారు. అనంతరం వైద్యులతో దీనిపై చర్చించిన డిప్యూటీ సీఎం.. గిరిజన మహిళల్లో రక్తహీనత, గర్భస్రావాలకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనీమియాను రక్త మార్పిడి ద్వారా తగ్గించేందుకు వీలుందని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తన సొంత డబ్బులతో అరకులోయలో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్, ఇతర దాతల సహకారంతో అరకు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ నిర్మాణం జరగనుంది. రక్తాన్ని నిలువ
చేసేందుకు వీలుగా ఇందులో అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తారు. నిర్మాణం పూర్తి అయిన తర్వాత దీనిని గవర్నమెంట్ ఆస్పత్రికి అనుసంధానం చేస్తారు. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా అల్లూరి జిల్లాలోని వందల మంది సికిల్ సెల్ అనీమియా బాధితులకు ఉపశమనం కలగనుంది. దీంతో గిరిజన మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.