
హైదరాబాద్ నగరంలో కొందరు యువకులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహంపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బైక్ నడుపుతూనే ల్యాప్టాప్లో ఆఫీస్ పనులు చేస్తూ, ప్రాణాలను పణంగా పెడుతున్న ఓ యువకుడి తీరును ఆయన సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు.
ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, సదరు యువకుడి నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బైక్ నడుపుతూనే ల్యాప్టాప్లో పని చేసుకోవడం కనిపిస్తోంది.దీనిపై స్పందించిన సజ్జనార్, "ఏ పనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఇంత ఆత్రుత ఎందుకు?
ఆత్రం ఎక్కువైతే ప్రాణాల మీదకు వస్తుంది" అని హెచ్చరించారు. రహదారిపై ప్రయాణిస్తున్నప్పుడు ఏకాగ్రత ఒక్క క్షణం తప్పినా, అది కేవలం సదరు వ్యక్తికే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని ఆయన గుర్తుచేశారు."కడుపు నింపుకోవడానికి చేసే పని, ప్రాణాలను కడతేర్చేలా ఉండకూడదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
రోడ్లపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలకు స్వస్తి పలికి, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని సజ్జనార్ హితవు పలికారు
.