
Heavy Rain Alert : కాస్త ఆలస్యం అయినా నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తున్నాయి. జూన్ ఫస్ట్ వీక్ లో మెళ్ళిగా ప్రారంభమైన వర్షాలు సెకండ్ వీక్ లో జోరందుకున్నాయి
. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం బీభత్సం సృష్టించింది. తాజాగా పరిస్థితులు వర్షాలకు మరింత అనుకూలంగా మారాయి... దీంతో తెలంగాణలో ఈ రాత్రి (శుక్రవారం) నుండి రేపు (శనివారం) ఉదయం భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరికొద్దిసేపట్లో తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను వర్షం ముంచెత్తే అవకాశాలున్నాయని తెలిపారు... అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదై ప్లాష్ ప్లడ్స్ వచ్చే ఛాన్సెన్స్ ఉన్నాయని హెచ్చరించారు. సంగెం, నెక్కొండ, ములుగు, పరకాల ప్రాంతాల్లోనూ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలుంటాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు రాత్రి జాగ్రత్తగా ఉండాలని... సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.
మరికొద్దిసేపట్లో ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక హన్మకొండ, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయట... అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపు (జూన్ 13, శనివారం) భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్,వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురు జల్లులు ఉంటాయని హెచ్చరించింది.
ఓవైపు వర్షాలు మొదలైనా మరోవైపు ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఇవాళ (జూన్ 12, శుక్రవారం) అత్యధికంగా ఆదిలాబాద్ లో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక నిజామాబాద్ లో 41.7, రామగుండంలో 41.5, హన్మకొండలో 40.5, ఖమ్మంలో 40.2, నల్గొండలొ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా హయత్ నగర్ లో 38.6 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. పటాన్ చెరులో 38.4, బేగంపేటలో 38.4, హకీంపేటలో 38.1. రాజేంద్ర నగర్ లో 38 డిగ్రీల ఉష్ఱోగ్రతలున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో శనివారం (జూన్ 13న) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని... ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.