
ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ సిబ్బంది
ప్రాణాలు కోల్పోగా.. వారిలో సురేష్ కూడా ఉన్నట్లు కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ వెల్లడించారు. విశాఖలోని శ్రీహరిపురానికి చెందిన సురేష్ గత 15 ఏళ్లుగా మెరైన్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లిన ఆయన.. ఇటీవల ఎంటీ సెట్టెబెల్లో అనే వాణిజ్య నౌకలో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. నౌకలో జనరేటర్లో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిశీలిస్తున్న సమయంలో దాడి జరగడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు నౌక యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది.
సురేష్ భార్య భార్గవి మాట్లాడుతూ.. ప్రతిరోజూ గుడ్ మార్నింగ్ సందేశం పంపేవారు. వీడియో కాల్ చేసే అవకాశం లేకపోయినా మెసేజ్ మాత్రం తప్పకుండా వచ్చేది. కానీ రెండు రోజులుగా ఎలాంటి సమాచారం రాలేదు. ఇప్పుడు ఆయన మరణించారనే వార్త వినాల్సి వచ్చింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
జూన్ 9న చివరిసారిగా మాట్లాడినప్పుడు త్వరలో ఇంటికి వస్తానని చెప్పారని, జూన్ 24న తమ వివాహానికి 15 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కలిసి వేడుక చేసుకుందామని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఇంటికి వస్తానన్నారు కానీ ఇలా శవమై వస్తారని ఊహించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
సురేష్కు భార్యతో పాటు 13, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అంతేకాకుండా భార్గవి అక్క బావ చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా ఈ కుటుంబమే తీసుకుంది. ప్రస్తుతం నలుగురు పిల్లల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఆయన సంపాదనపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు పిల్లల చదువులు, భవిష్యత్తు ఎలా సాగుతుందో అర్థం కావడం లేదని భార్గవి తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు సురేష్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సురేష్ మరణవార్తతో విశాఖలోని ఆయన నివాసానికి బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటించింది.
మ్యాక్ ఓఎస్ 27 గోల్డెన్ గేట్: ఆపిల్ తెచ్చిన టాప్ 5 నాన్-AI ఫీచర్లు ఇవే!
.