ఏ రాజకీయ పార్టీకైనా కేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు చాలాముఖ్యం. ఎలాంటి మేలు ఆశించకుండా నిస్వార్థంగా పార్టీకోసం, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి గెలుపుకోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు
ఎంతోమంది ఉంటారు. అలాంటి కార్యకర్తలకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ నేతకు ఉంటుంది. అందుకే కొన్ని రాజకీయ పార్టీలు కార్యకర్తే అధినేత అనే స్లోగన్ ఇస్తున్నాయి. ఇలా ఎన్నో ఏళ్లుగా పార్టీని వదలకుండా జెండా మోసే సాధారణ కార్యకర్తల మంచి, చెడు చూసుకునే ఎంతోమంది నేతల్ని చూసుంటాం. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా ఏపీలో ఇద్దరు పార్టీ కార్యకర్తల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా, నిబద్ధతతో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేతలు అండగా ఉంటారని నిరూపించారు.కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నరసాపురం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన పనిచేస్తున్న ఇద్దరు కార్యకర్తలకు ఆయన అండగా నిలిచారు. వారిద్దరికి ఇచ్చిన మాట ప్రకారం సొంత డబ్బులతో ఇళ్లు నిర్మిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన మెట్ట లక్ష్మీనరసింహ శ్రీనివాస్ బీజేపీ కోసం పనిచేశారు. పాపం ఆయన కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే గత 30 ఏళ్లుగా కొండేపూడికు చెందిన రామారావు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఈ రెండు కుటుంబాల కోసం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చొరవ తీసుకుని.. ఒక్కోటి రూ.20 లక్షల ఖర్చుతో రెండు ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ రామారావు ఇంటి నిర్మాణానికి సంబంధించిన శ్లాబు పనులు జరుగుతున్నాయి.. కేంద్రమంత్రి వెళ్లి పనుల్ని పరీశిలించారు. ఆయన కూడా తనవంతుగా శ్రమదానం చేసి పనులను పర్యవేక్షించారు. కేంద్రంలో ఉన్నత పదవిలో ఉన్నా సరే తన గెలుపు కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేసిన సామాన్య కార్యకర్తలను మర్చిపోలేదు. పార్టీకి ఇద్దరు కార్యకర్తలు చేసిన కృషి, కష్టంతోనే ఎంపీగా, కేంద్రమంత్రిగా అవకాశం వచ్చిందని శ్రీనివాసవర్మ గుర్తు చేశారు.'ఉండి నియోజకవర్గం కొండేపూడి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త రామారావు గారికి ఇచ్చిన మాట ప్రకారం.. ఆయన నూతన గృహాన్ని నా సొంత ఖర్చుతో నిర్మిస్తున్నాము. ఈరోజు ఆ ఇంటి స్లాబ్ పనుల్లో స్వయంగా పాల్గొని కార్యకర్తలతో కలిసి 'శ్రమదానం' చేయడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చింది. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న ఏ కార్యకర్త శ్రమా వృధా పోదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ తన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది' అంటూ కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వీడియోను ట్వీట్ చేశారు.