
అమెరికా-ఇరాన్ మధ్య తిరిగి ఉద్రిక్తలు పురుడుపోసుకున్న వేళ హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం ఇరుదేశాలూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో ఒమన్ తీరంలో వెళ్తున్న ఓ విదేశీ నౌకపై అమెరికా (US)
క్షిపణులతో దాడి చేసింది. ఇందులో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ మండిపడుతోంది. అమెరికా ఈ దాడుల్ని తక్షణం నిలిపేయాలంటూ ఇవాళ మన విదేశాంగశాఖ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆ దాడి వెనుక కారణాల్మి అమెరికా బయటపెట్టింది.ఒమన్ తీరంలో భారతీయ నావికులు వెళ్తున్న నౌకపై తమ దాడి నిజమేనని అమెరికా ఇవాళ అంగీకరించింది. నౌక ఇంజిన్ గదిలోకి రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ వారం ఒమన్ సమీపంలో దాడికి గురైన భారతీయ సిబ్బందితో ఉన్న మూడవ నౌక ఇది. ఎక్స్ లో పెట్టిన పోస్ట్‌లో యూఎస్ సెంట్రల్ కమాండ్ .. ఇరాన్ నుండి ఒమన్ గల్ఫ్ ద్వారా చమురును రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న గినియా-బిస్సావు జెండా కలిగిన M/T జల్వీర్ నౌకపై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) చర్య తీసుకుంది. యూఎస్ దళాల ఆదేశాలను సిబ్బంది పదేపదే పాటించడంలో విఫలమైన తర్వాత, ఒక యూఎస్ విమానం నౌక ఇంజిన్ గదిలోకి రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ప్రయోగించింది.ఈ దాడికి సంబంధించిన ఫొటోల్నీ కూడా అమెరికా విడుదల చేసింది. మరోవైపు ఈ దాడి తర్వాత భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ దాడిపై వివరణ ఇవ్వాలని ఇప్పటికే అమెరికా భద్రతాధిపతికి భారత్ సమన్లు జారీ చేసింది. ఆయన వివరణ తీసుకున్న తర్వాత తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ దాడిపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. అయినా అమెరికా మాత్రం హార్ముజ్ ను దాటే నౌకల విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.