Bihar RJD Leader JCB Fall : రాజకీయ నాయకులు వార్తల్లో నిలవడానికి రకరకాల విన్యాసాలు చేయడం మనం చాలా సార్లే చూస్తుంటాం. అచ్చంగా అలాగే చేశాడో ఆర్జేడీ నేత. కాకపోతే ఆయన మీడియా అటెన్షన్ కోసం చేసిన ఆ స్టంట్
కాస్తా వికటించి.. అందరినీ నవ్వించింది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 79వ పుట్టినరోజు వేడుకలను వెరైటీగా నిర్వహించి వార్తల్లోకి ఎక్కాలనుకున్నాడు. అందుకోసం స్థానిక ఆర్జేడీ నేత కేదార్ యాదవ్.. జేసీబీ ఎక్కి కేక్ చేత పట్టుకుని మరీ లాలూ భజన చేశాడు. ఆపై కేక్ కట్ చేయబోతుండగా.. ఒక్కసారిగా కాలు జారి బొక్కబోర్లా పడ్డాడు. అప్పటికే రోడ్డు మీదంతా బురద ఉండగా.. ఆయన పడిన తీరు చూసి అంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. కానీ ఆయన అనుచరుడు వెంటనే స్పందించి ఆయన్ను పైకి లేపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆపూర్తి వివరాలు మీకోసం. ముందు చెట్టెక్కాడు.. కుదరకపోయే సరికి జేసీబీ తెచ్చాడు!బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన కేదార్ యాదవ్కు గతంలోనూ ఇలాంటి వింత చేష్టలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. అప్పట్లో ఓసారి ఆయన ఎద్దులను, దున్నపోతులను ఎక్కి ప్రదర్శనలు చేయడం, చెట్లు ఎక్కడం, రిక్షాలపై వింతగా ప్రయాణించడం లాంటి పనులతో స్థానికంగా హైలైట్ అయ్యారు. ఈ ఏడాది కూడా లాలూ ప్రసాద్ యాదవ్ పుట్టినరోజును మరింత విభిన్నంగా జరపాలని ఆయన ప్లాన్ చేశారు. భగవాన్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా.. కేదార్ యాదవ్ మొదట ఒక చెట్టు ఎక్కి లాలూ బర్త్డే కేక్ కట్ చేయాలని ప్రయత్నించారు. అయితే అక్కడ జనం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో.. వెంటనే రూట్ మార్చి ఒక జేసీబీ వాహనాన్ని రంగంలోకి దించారు. ఆ సమయంలో అక్కడ భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా.. గాల్లో కేక్ కట్ చేసి తన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవాలని ఆ జేసీబీపైకి ఎక్కారు.బురదలో పడ్డా.. లాలూ ‘నెల్సన్ మండేలా’ అంటూ నినాదాలు!వర్షం కారణంగా జేసీబీ ఉపరితలం మొత్తం తడిగా మారిపోయింది. కేదార్ యాదవ్ పైకి ఎక్కి కేక్ కట్ చేసే క్రమంలో ఒక్కసారిగా కాలు జారి బ్యాలెన్స్ తప్పారు. అంతే.. అందరూ చూస్తుండగానే జేసీబీ పైనుంచి నేరుగా కింద ఉన్న బురదలో బోర్లా పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు పెద్దగా గాయాలు కాకపోయినప్పటికీ.. దానికి సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే కిందపడినా కూడా ఆయన అనుకున్నట్లుగానే మీడియా ఫోకస్ మొత్తం తనపైకి తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు.ఇంతటి గందరగోళం జరిగినప్పటికీ కేదార్ యాదవ్ మాత్రం లాలూ యాదవ్ దీర్ఘాయుష్షును కోరుకుంటూ కేక్ కటింగ్ వేడుకను పూర్తి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అధినేతపై ప్రశంసల వర్షం కురిపించారు. లాలూ ప్రసాద్ యాదవ్ భారత దేశానికి నెల్సన్ మండేలా లాంటివారని చెప్పారు. ఆయన పేదల పాలిటి దేవుడని.. అందుకే ఆయన పుట్టినరోజును ఇంతటి ఆనందోత్సాహాల మధ్య జరపాలనుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ జేసీబీ స్టంట్ ఫెయిల్యూర్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.