
కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో RBI త్వరలోనే అన్ని కాగితపు కరెన్సీ నోట్లను రద్దు చేసి, వాటి స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టబోతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా 2026 జూన్ 30
తర్వాత పాత నోట్లు చెల్లవనే విధంగా ప్రచారం జరిగింది. ఈ వార్త వేగంగా వ్యాపించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. చాలామంది తమ వద్ద ఉన్న కరెన్సీ నోట్ల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేశారు.
ఈ వైరల్ వార్తపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమా చారం పూర్తిగా తప్పుడు ప్రచారం అని స్పష్టం చేసింది. RBI ఎప్పుడూ కాగితపు నోట్లను ఉపసంహరించుకోవడం లేదా 2026 జూన్ 30 నుంచి ప్లాస్టిక్ నోట్లతో భర్తీ చేయడం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలిపింది. ప్రజలు ఇలాంటి నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని, ఇతరులకు పంపవద్దని సూచించింది.
ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్ల అంశంపై RBI పూర్తిగా మౌనం వహించలేదు. 2026 జూన్ 5న జరిగిన ద్రవ్య విధాన సమీక్ష సమావేశం అనంతరం సంజయ్ మల్హోత్రా మీడియాతో మాట్లాడుతూ పాలిమర్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై పరిశీలన జరుగుతోందని చెప్పారు. అయితే ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. పాలిమర్ నోట్ల వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. అంటే ప్రస్తుతం ప్లాస్టిక్ నోట్లు వెంటనే రాబోతున్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.
RBI విధానాల ప్రకారం కొత్త డిజైన్ నోట్లు విడుదలైనప్పుడు పాత నోట్లు వెంటనే చెల్లుబాటు కాకుండా ఉండవు. సాధారణంగా పాత, కొత్త డిజైన్ నోట్లు కొంతకాలం పాటు ఒకేసారి చలామణిలో ఉంటాయి. కాలక్రమేణా ఎక్కువగా అరిగిపోయిన లేదా తిరిగి జారీ చేయడానికి అనువుగా లేని పాత నోట్లను RBI క్రమంగా ఉపసంహరిస్తుంది. కాబట్టి కొత్త డిజైన్ రావడం అంటే పాత నోట్లు ఒక్కసారిగా రద్దు అవుతాయని అర్థం కాదు.
ప్రస్తుతం భారతదేశంలో ముద్రిస్తున్న కరెన్సీ నోట్లు సాధారణ కాగితంతో తయారుకావు. వీటి తయారీలో 100 శాతం పత్తి (Cotton) ఆధారిత ప్రత్యేక కరెన్సీ పేపర్ను ఉపయోగిస్తారు. దీనివల్ల నోట్లు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఒకవేళ చలామణికి అనర్హమైన లేదా తీవ్రంగా దెబ్బతిన్న నోట్లు బ్యాంకులకు చేరితే, వాటిని RBIకి పంపించి నిబంధనల ప్రకారం స్క్రాప్ చేస్తారు.