Jahangir Khan TMC Arrest : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం చక్రం తిప్పిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, ఫాల్తా నియోజకవర్గ అభ్యర్థి జహంగీర్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే. నెల రోజుల క్రితమే
.. ఓ ఐపీఎస్ ఆఫీసర్కు ఈయన సవాల్ విసిరారు. ముఖ్యంగా నువ్వు సింగం అయితే నేను పుష్ప అంటూ అవాకులు చవాకులు పేల్చారు. అయితే తాజాగా ఈయన్ను.. పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల రోజులుగా పరారీలో ఉన్న ఇతడిని పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు.. భారత్, నేపాల్ సరిహద్దుల్లో శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆయనకు ముందస్తు మధ్యంతర రక్షణ పొడిగించేందుకు నిరాకరించిన కొద్ది సేపటికే.. ఎస్టీఎఫ్ రంగంలోకి దిగి ఆయన్ను అరెస్ట చేసింది. బెంగాల్లో 15 ఏళ్ల టీఎంసీ పాలన ముగిసి.. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జహంగీర్పై ఐదుకు పైగా క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.సింగం వర్సెస్ పుష్ప..టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీకి అత్యంత ఆప్తుడిగా పేరుపొందిన జహంగీర్ ఖాన్.. ఫాల్తా పరిసర గ్రామాల్లో తనదైన శైలిలో పట్టు సాధించారు. అయితే ఎన్నికల సమయంలో ఇక్కడ ప్రత్యేక అబ్జర్వర్గా వచ్చిన యూపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి, ‘సింగం’ ఇమేజ్ ఉన్న అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారాయి. అజయ్ పాల్ నేరుగా జహంగీర్ అడ్డాకే వెళ్లి హెచ్చరికలు జారీ చేయడంతో.. టాలీవుడ్ హిట్ సినిమా క్యారెక్టర్ను గుర్తు చేస్తూ తనను తాను స్థానిక 'పుష్ప'గా జహంగీర్ అభివర్ణించుకున్నారు. తగ్గేదే లేదంటూ పోలీసులకు సవాల్ విసిరారు. పోటీ నుంచి తప్పుకున్న నేత..ఫాల్తా నియోజక వర్గంలో ఏప్రిల్ 29వ తేదీన జరిగిన రెండో విడత పోలింగ్ సందర్భంగా ఈవీఎంలలో బీజేపీ ఓటింగ్ బటన్పై టేప్ అంటించారనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. భారీ అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదులతో ఎన్నికల సంఘం మే 21వ తేదీన ఇక్కడ పునఃపోలింగ్కు ఆదేశించింది. అయితే ఈలోపే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమవడంతో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హామీ ఇచ్చారంటూ.. మే 19వ తేదీనే జహంగీర్ ఖాన్ అకస్మాత్తుగా పోటీ నుంటి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తన కార్యాలయానికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నిర్ణయంతో టీఎంసీ అధిష్ఠానం ఆయనకు దూరం జరిగింది.రికార్డు మెజారిటీతో బీజేపీ విజయం..జహంగీర్ ఖాన్ తప్పుకున్న తర్వాత జరిగిన పునఃపోలింగ్ ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా ఒక లక్షకు పైగా ఓట్ల రికార్డు మెజారిటీతో సీపీఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మీపై ఘనవిజయం సాధించారు. పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్కు కేవలం 8,000 లోపు ఓట్లు మాత్రమే పోలై.. నాలుగో స్థానానికి పడిపోయారు. ఎన్నికల అవకతవకలు, బెదిరింపుల కేసులలో ఎట్టకేలకు ‘పుష్ప’ జహంగీర్ ఖాన్ పట్టుబడటంతో బెంగాల్ రాజకీయాల్లో ఈ అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది.