
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం అధికారికంగా విడుదల చేశారు. జూన్ 18న జరగనున్న రాజ్యసభ
ఎన్నికల్లో పార్టీ తరఫున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ బరిలో నిలవనున్నారు.వివరాల్లోకి వెళ్తే, రాజ్యసభ అభ్యర్థులుగా పారిశ్రామికవేత్త సానా సతీష్, ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా విభాగం ముఖ్య నేతగా ఉన్న చింతకాయల విజయ్లను ఎంపిక చేసినట్లు పార్టీ ప్రకటించింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరగ్గా, చివరికి అధిష్టానం ఈ ముగ్గురి పేర్లను ఖరారు చేసింది.ఈ ముగ్గురిని చంద్రబాబు ఇవాళ తన క్యాంపు కార్యాలయానికి పిలిపించి స్వయంగా బి-ఫారాలు అందజేశారు. వారు సోమవారం నాడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి అధికారికంగా పత్రికా ప్రకటన వెలువడింది. కాగా, ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడం తెలిసిందే. కూటమి పొత్తు ధర్మం ప్రకారం నాలుగు స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, తమ అభ్యర్థిగా జనసేన పార్టీ లింగమనేని రమేష్ పేరును ఖరారు చేయడం తెలిసిందే.