
జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు
జనసేన పార్టీకి కేటాయించిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. లింగమనేని రమేష్ శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.రమేష్ 2015 నుంచి పవన్ కల్యాణ్తో, జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ ఆలోచనా విధానానికి ఆకర్షితులై ఆయనకు వెన్నుదన్నుగా నిలిచినట్లు పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ, రమేష్ పార్టీ సిద్ధాంతాలపై, పవన్ కల్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో నిలిచారని జనసేన తెలిపింది. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీకి అండగా నిలిచిన వారికి కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే సూత్రం ప్రకారమే ఈ ఎంపిక జరిగినట్లు స్పష్టం చేసింది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకే ఆయనకు ఈ అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి.