అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇరు దేశాలు డోలాయమానంలో ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, బెదిరింపులకు దిగుతున్నాయి తప్పా తుది నిర్ణయానికి రాలేకపోతున్నాయి. తాజాగా, అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరాన్కు అమెరికా, దాని మిత్రదేశాలు ‘బహుముఖ యుద్దాన్ని’ సాగిస్తున్నాయని, తమ స్థిరత్వాన్ని, పురోగతిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు మోజ్తాబా ఖమేనీ ఎక్స్ (ట్విట్టర్)లో వరుస పోస్ట్లు పెట్టారు. ‘‘అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ను ఒక ప్రాంతీయ సైనిక స్థావరంగా మార్చి దానికి మద్దతు ఇస్తోందని, బలమైన, స్వతంత్ర ఇరాన్గా మారకుండా అడ్డుకోవడమే వారి ముఖ్య ఉద్దేశం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ను ఒక ‘అక్రమ’ దేశంగా అభివర్ణించిన ఆయన.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలన్నీ టెహ్రాన్కు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న విస్తృత ప్రచారంలో భాగమేనని ఖమేనీ దుయ్యబట్టారు. ఇరాన్ నాయకత్వంపై ప్రజల్లో సందేహాలు, భయాలు, నిరాశ, అసంతృప్తి రగిలించడానికి మానసిక, సమాచార వ్యూహాలపై శత్రువులు దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు, ప్రజల ధైర్యాన్ని బలహీనపరచడం, అధికారుల నిర్ణయాధికారాన్ని వక్రీకరించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు.తమ సాయుధ దళాల చేతుల్లో శత్రువులకు ఘోరమైన అవమానం ఎదురైందని, తామేంటో రుచి చూపించామని మోజ్తాబా అమెరికా, దాని మిత్రదేశాలను ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలు తమ ఐక్యతను చాటుకోవాలని, శత్రువులకు ప్రయోజనం చేకూర్చే కథనాలను ప్రచారం చేయవద్దని సుప్రీం లీడరర్ పిలుపునిచ్చారు. ప్రజల్లో నిరుత్సాహాన్ని కలిగించే ఎలాంటి చర్యలైనా శత్రువుకు సహాయం చేయడమే అవుతుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్లో తక్షణమే సైనిక చర్యను నిలిపివేయాలని అమెరికా ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. ఇక, డొనాల్డ్ ట్రంప్ మాత్రం అణ్వాయుధాలను సమకూర్చుకోబోమని ఇరాన్ తమకు మాటి ఇచ్చిందని బుధవారం ప్రకటించారు. అంతేకాదు, మోజ్తాబా ఖమేనీ అమెరికాతో చర్చల్లో పాల్గొంటున్నారని ఆయన వివరించారు. అంతేకాదు, తానే ఇరాన్ సుప్రీం
లీడర్ను కలుస్తానని, స్వయంగా చర్చలు జరుపుతానని చెప్పారు.