.webp&w=3840&q=75)
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ సెంటిమెంట్, పవన్ కళ్యాణ్ సభల చుట్టూ తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతోంది. హైదరాబాద్లో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించ తలపెట్టిన "నవనిర్మాణ సంకల్ప సభ" ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది.
ఈ సభను ఉద్దేశించి కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్, టిఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ కాకను పుట్టించాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభ పెట్టుకోవాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేయగా, కవిత మరింత ఘాటుగా స్పందించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య తెలుగువన్ న్యూస్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కవిత, పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ పేరు వింటేనే కొందరికి భయం పట్టుకుందని, అందుకే ఈ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకోవడానికి వీల్లేదన్నట్లు మాట్లాడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ గతంలో ఒరిస్సా, మహారాష్ట్రలో బీఆర్ఎస్ పేరిట సభలు పెట్టలేదా అని బాలకోటయ్య నిలదీశారు. తెలంగాణ వాదులుగా చెప్పుకునే కొందరు నాయకులు తాలిబాన్లలా మాట్లాడుతున్నారని, ఇది తీవ్రమైన రాజకీయ ఉన్మాదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని చేతకాలేదన్న కవిత వ్యాఖ్యలకు బాలకోటయ్య గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతి రాజధాని కోసం 28,000 మంది రైతులు సుమారు 34,000 ఎకరాల భూములను త్యాగపూర్వకంగా ఇచ్చారని, అది ధీరోదాత్తమైన రాజధాని అని గుర్తు చేశారు.
.
.