ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల కోసం వినూత్న ఆలోచన చేసింది.. ఇంటికే కూరగాయల్ని హోం డెలివరీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో డీజీ రైతు బజార్లను ప్రారంభించింది.
మార్కెటింగ్ శాఖ ప్రారంభించిన ఈ రైతు బజార్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో గతేడాది డిసెంబర్లో రైతు బజార్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ తర్వాత మధురవాడ, గాజువాక, గోపాలపట్నం, నరసింహనగర్లో ఏర్పాటు చేశారు. నగరంలోని ఐదు డీజీ రైతుబజార్ల నుంచి జూన్ నెలకు సంబంధించి 5,800కుపైగా హోం డెలివరీలు చేశారు. నగరంలో కేవలం 10 నిమిషాల్లోనే కూరగాయలు చేరవేస్తుండటంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. డీజీ రైతు బజార్లలో తాజా, నాణ్యమైన కూరగాయలను ప్రజలు అందిస్తున్నారు. కూరగాయల్ని చేరవేసేందుకు డెలివరీ బాయ్స్ను నియమించారు.. రోజుకు 12 గంటల పాటూ సేవలు అందిస్తున్నారు. వీరికి నెలకు రూ.19 వేల జీతం ఇస్తున్నారు. డెలివరీ బాయ్స్ ఆర్డర్ రాగానే కూరగాయల్ని గ్రేడింగ్ చేసి హోం డెలివరీ చేస్తున్నారు. ఒకవేళ కూరగాయలు నాణ్యంగా లేకపోతే మళ్లీ మార్చి ఇస్తారు. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరిగిందని చెబుతున్నారు. ఈ డీజీ రైతు బజార్ల నుంచి ఐదు కిలో మీటర్ల వరకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. అందుకే కేవలం 10 నిమిషాల్లోనే కూరగాయాలు వినియోగదారులకు అందుతున్నాయి.కూరగాయలు హోం డెలివరీ చేసినందుకు నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఒక్కో ఆర్డర్కు కిలోమీటర్కు రూ.1 డెలివరీ ఛార్జ్.. హ్యాడ్లింగ్ ఛార్జీల కింద రూ.10 వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు రూ.100కు కూరగాయలు ఆర్డర్ పెడితే రూ.115 (రూ.100 కూరగాయలు+ఐదు కిలోమీటర్లకు రూ.5 డెలివరీ ఛార్జ్+హ్యండ్లింగ్ ఛార్జ్ రూ.10) వసూలు చేస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 7గంటల వరకు ఈ డీజీ రైతు బజార్ల సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రజల నుంచి మంచి ఆదరణ పెరగడంతో నగరంలోని మరికొన్ని చోట్ల రైతు బజార్లను విస్తరిస్తామని అధికారులు చెబుతున్నారు. కూరగాయలతో పాటుగా నిత్యావసర సరుకులు కూడా అందజేస్తున్నాము అంటున్నారు. డెలివరీ బాయ్స్ కూడా ఈ సేవలపై సంతృప్తితో ఉన్నారు.