
YS Jagan: మరోసారి ఏపీ సర్కార్, పోలీస్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్..
విజయవాడలో సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్న టాక్సీ డ్రైవర్ క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించారు జగన్.. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయసాయం అందించి, వారికి న్యాయం జరిగేలా పోరాడతామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్, క్రాంతికుమార్ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఒకే ఇంట్లో తీవ్ర పేదరికంలో జీవిస్తున్నారని, ఎనిమిదేళ్లుగా క్రాంతికుమార్పై ఎలాంటి కేసులు లేవని, గతంలో నమోదైన కేసులు కూడా కొట్టివేయబడ్డాయని తెలిపారు. అలాంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పదేపదే ఎందుకు పిలిచి వేధించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3 నెలల పాటు పోలీసుల వేధింపులు తట్టుకోలేకే క్రాంతికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తన సెల్ఫీ వీడియోలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడని జగన్ పేర్కొన్నారు. భార్య, చిన్నారులు ఉన్న వ్యక్తిని బెదిరించి, మానసికంగా వేధించడం అత్యంత బాధాకరమని అన్నారు.
రాజధాని ప్రాంతంలోనే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం పోలీసు వ్యవస్థ పనితీరుకు నిదర్శనమని జగన్ విమర్శించారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీస్ కమిషనర్ కార్యాలయాలు సమీపంలోనే ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఐని సీసీ.. సీపీని డీజీపీ.. డీజీపీని సీఎం రక్షిస్తున్నారని ఆరోపించారు వైఎస్ జగన్.
గత రెండు నెలల్లో ఒక లాకప్ డెత్, మరో సెల్ఫీ సూసైడ్ ఘటన చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని జగన్ అన్నారు. ఇప్పటి వరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయకపోవడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. క్రాంతికుమార్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, న్యాయపరంగా పూర్తి సహాయం అందించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..