వైద్య సాంకేతిక రంగంలో హైదరాబాద్ నగరానికి శాస్త్రవేత్తలు మరో మైలురాయిని అధిగమించారు. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న కోట్లాది మంది
రోగులకు అత్యంత సులువైన, చౌకైన మార్గంలో వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చేందుకు బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ప్రొఫెసర్లు సరికొత్త ఆవిష్కరణ చేశారు. కిడ్నీల పనితీరులో వచ్చే లోపాలను అత్యంత వేగంగా, రోగి ఉన్న చోటుకే వెళ్లి పరీక్షించేలా ఒక చిన్న మొబైల్ పరికరాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. బిట్స్ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్లు పార్వతినాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్.పొన్నాలగు, సంకేత్ గోయల్ల బృందం ఈ అద్భుతమైన పరిశోధనకు రూపకల్పన చేసింది.సాధారణంగా కిడ్నీల పనితీరును, వాటి ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి వైద్యులు బయోమార్కర్ పరీక్షలను సిఫార్సు చేస్తారు. ప్రస్తుతం ఈ పరీక్షల కోసం రోగులు ఆసుపత్రులకో లేదా పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు వెళ్లాల్సి వస్తోంది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత నివేదికలు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. ఈ సాంప్రదాయ పద్ధతికి భిన్నంగా, బిట్స్ శాస్త్రవేత్తలు పోర్టబుల్ మల్టీప్లెక్స్ ఎలక్ట్రో కెమికల్ డయాగ్నోస్టిక్ అనే చిన్న పరికరాన్ని రూపొందించారు. దీనిని సులభంగా జేబులో వేసుకుని రోగుల వద్దకే నేరుగా తీసుకెళ్లవచ్చు.ఈ వినూత్న పరికరంలో లేజర్ గ్రాఫేన్, అధునాతన ఎలక్ట్రోడ్లు, నానో-ఎలక్ట్రోకెమికల్ సెన్సార్లను అమర్చారు. మూత్రపిండాల వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి కీలకమైన క్రియాటినైన్, యూరిక్ యాసిడ్, యూరియా వంటి మూడు ప్రధాన బయోమార్కర్ల పరిమితులను ఈ పరికరం క్షణాల వ్యవధిలో ఖచ్చితత్వంతో లెక్కిస్తుంది. ఈ పరికరాన్ని రోగి సెల్ఫోన్కు అనుసంధానించవచ్చు. మొబైల్లోని ఒక ప్రత్యేకమైన బ్రౌజర్ అప్లికేషన్ ద్వారా ఈ పోర్టబుల్ ఎలక్ట్రోకెమికల్ పరికరం బయోమార్కర్ల రీడింగులను స్క్రీన్పై స్పష్టంగా ప్రదర్శిస్తుంది. దీనివల్ల రోగులు ల్యాబ్ రిపోర్టుల కోసం వేచి చూడాల్సిన అవసరం తప్పుతుంది.తమ ప్రయోగశాలలో ఈ పరికరం పనితీరును వివిధ దశల్లో క్షుణ్ణంగా పరిశీలించినట్లు బిట్స్ ఆచార్యులు వెల్లడించారు. ఈ విజయవంతమైన పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పరిశోధన పత్రాన్ని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సైన్స్ డైరెక్ట్ జర్నల్కు పంపగా.. అది ఇటీవల ఆన్లైన్లో అధికారికంగా ప్రచురితమై ప్రపంచ శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది. ఈ అధునాతన పరికరాన్ని మరింత మెరుగుపరిచి త్వరలోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసి మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు లేని చోట ఈ పరికరం ప్రాణ రక్షక గ్యాడ్జెట్గా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.