
కోరుట్ల, జూలై 1: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( ఎస్ఐర్ ) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
బుధవారం జగిత్యా జిల్లా కోరుట్ల పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటా చేపట్టిన సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల అందజేత, వివరాల నమోదు, అవగాహనపై క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును పరిశీలించిన కలెక్టర్ బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. ఈమేరకు కలెక్టర్ మాట్లాడుతూ సర్ సర్వేను సమర్ధవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు అవకాశం కల్పించాలన్నారు.
ప్రతి ఇంటిని తప్పనిసరిగా బీఎల్వోలు సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని పేర్కొన్నారు. ఓటర్ల సందేహలను నివృత్తి చేస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పని చేయాలని పేర్కొన్నారు. ఓటర్ల నుంచి పారాలను నిర్ణీత గడువులోగా స్వీకరించి, వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలు సర్ ప్రక్రియకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే కీలక ప్రక్రియ అని చెప్పారు. అధికారులు, బీఎల్ ఓలు పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్టీవో జీవాకర్ రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, ఆర్ఐ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.